హైదరాబాద్: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం

- February 20, 2026 , by Maagulf
హైదరాబాద్: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: అమీర్‌పేట్ ప్రాంతంలో ఉన్న మైత్రీవనం నీలగిరి బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ మొత్తం అంతస్తును కమ్మేసింది. ఆ సమయంలో తరగతులు కొనసాగుతున్నట్లు సమాచారం. పొగ తీవ్రత పెరగడంతో పలువురు విద్యార్థులు లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. భవనంలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ముఖ్యంగా బాల్కనీల ద్వారా వారిని ఒక్కొక్కరిని కిందికి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. నీలగిరి బ్లాక్ అంతటా దట్టమైన పొగ అలుముకోవడంతో అక్కడి పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా, విద్యార్థులంతా సురక్షితంగా బయటపడేలా చర్యలు తీసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com