తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు

- February 24, 2026 , by Maagulf
తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు

హైదరాబాద్: తెలంగాణలో నక్సల్ ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఇద్దరు అగ్రశ్రేణి నాయకులతో సహా మొత్తం నలుగురు కీలక నేతలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

లొంగిపోయిన వారిలో పార్టీలోని అత్యున్నత విభాగాలకు చెందిన వారు ఉండటం గమనార్హం పొలిట్‌బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (దామోదర్), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి (గంగన్న) హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. 

మావోయిస్టు నేత దేవ్ జీ మాట్లాడుతూ, అనారోగ్య కారణాల రీత్యా తాను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఇది కేవలం వ్యక్తిగత జీవితం కోసం కాదని, ప్రజల సమస్యలపై చట్టబద్ధమైన పద్ధతుల్లో (లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో) పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. “దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం గైడెన్స్‌గా ఇకపై రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను” అని ఆయన అన్నారు.

విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. తొందరపడి మాట్లాడితే అపార్థాలకు దారితీస్తుందని, తన భవిష్యత్ రాజకీయ జీవితానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రస్తుతం అన్ని విషయాలు పంచుకోలేకపోతున్నానని వివరించారు. త్వరలోనే ఇంటర్వ్యూల రూపంలో అన్ని ప్రశ్నలకు వివరంగా సమాధానమిస్తానని హామీ ఇచ్చారు. ఈ పరిణామం తెలంగాణలో మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com