శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

- February 26, 2026 , by Maagulf
శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ “తెప్ప తిరునాళ్లు” వేడుకల్లో భాగంగా తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల గుండా సాగి పుష్కరిణి వద్దకు చేరుకుంది. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారు అధిరోహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారు పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. ఈ వేడుకను కళ్లారా చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

తిరుమల తెప్పోత్సవాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీ.శ. 1468లో శ్రీ సాళువ నరసింహరాయలు పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి ఈ ఉత్సవాలకు పునాది వేశారు. 15వ శతాబ్దంలో అన్నమయ్య ఈ వేడుకలను తన కీర్తనలతో కొనియాడారు. మధ్యలో కొంతకాలం ఆగిపోయిన ఈ ఉత్సవాలను 1921లో తిరిగి పునరుద్ధరించారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఈ ఐదు రోజుల వేడుకలు జరుగుతాయి.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com