కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- February 27, 2026
భారతీయ రైల్వే చరిత్రలో కోల్కతా మెట్రో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే మొదటిసారిగా ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్’ (BESS)ను మెట్రో రైళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టారు.
సాధారణంగా విద్యుత్ అంతరాయం కలిగితే మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ సెక్షన్లలో ఇది ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే, ఈ కొత్త బ్యాటరీ వ్యవస్థ సాయంతో విద్యుత్ నిలిచిపోయినప్పటికీ, రైలును సురక్షితంగా సమీపంలోని స్టేషన్కు చేరుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికులు సొరంగ మార్గాల్లో చిక్కుకుపోయే ప్రమాదం తప్పుతుంది.
కోల్కతాలోని అండర్ గ్రౌండ్ ‘బ్లూ లైన్’లో తరచుగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుండటంతో రైళ్లు ఆగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మెట్రో అధికారులు 6.4 MWh సామర్థ్యం ఉన్న భారీ ‘లిథియం ఐరన్ ఫాస్పేట్’ బ్యాటరీలను మెట్రో సెంట్రల్ సబ్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఈ శక్తివంతమైన బ్యాటరీలు అత్యవసర సమయాల్లో వెన్నెముకలా నిలుస్తాయి.
ఏదైనా కారణాలతో మెయిన్ విద్యుత్ సరఫరా ఆగిపోతే.. బ్యాటరీల ద్వారా ఇంజిన్లకు కరెంట్ పంపిణీ చేస్తారు. దీంతో మధ్యలోనే రైళ్లు నిలిచిపోకుండా సమీప మెట్రో స్టేషన్ వరకు చేరుకుంటాయని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా దిగొచ్చని కోల్కతా మెట్రో అధికారులు పేర్కొన్నారు. రైలు గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణించగలదని, టన్నెల్ వెంటిలేషన్ తదితర ముఖ్యమైన వ్యవస్థలకూ బ్యాటరీల ద్వారా విద్యుత్ అందుతుందని చెప్పారు.
BESS వ్యవస్థలో ఇన్వర్టర్లు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీలు ఉంటాయి. విద్యుత్తు అంతరాయం లేదా గ్రిడ్ వైఫల్యం సంభవించినప్పుడు నిల్వ చేసిన ఎనర్జీని అందించగలవు. 4 MW BESS అనేది 2021లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ ప్రకారం రూపకల్పన జరిగింది. ఈ వ్యవస్థ జీవితకాలం సుమారు 14 సంవత్సరాల. డిజైన్లో కాంపాక్ట్గా ఉంటుంది. ఇది సాంప్రదాయ జనరేటర్ల కంటే మెరుగైన శక్తి సామర్థ్యంతో పనిచేయడమే కాదు.. కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









