అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన

- March 02, 2026 , by Maagulf
అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన

మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరిపే ఉద్దేశ్యం తమకు లేదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ వేదికలపై అమెరికా తీరును తీవ్రంగా ఎండగట్టారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న అశాంతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణమని లారిజానీ విమర్శించారు. ఒకప్పుడు “అమెరికా ఫస్ట్” అని నినదించిన ట్రంప్, ఇప్పుడు దాన్ని “ఇజ్రాయెల్ ఫస్ట్” గా మార్చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రాజకీయ లబ్ధి కోసం అమెరికా సైనికుల ప్రాణాలను ట్రంప్ పణంగా పెడుతున్నారని ఆరోపించారు.

ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల నుండి ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని లారిజానీ తెలిపారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి వెనకాడబోమని, చర్చల కంటే ప్రతిఘటనకే మొగ్గు చూపుతామని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో స్పష్టం చేశారు.

మరోవైపు, ఇరాన్ మద్దతు ఉన్న ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్’ సంస్థ ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ, అమెరికా సైనికులెవరూ గాయపడలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com