56వ డిస్ట్రిక్ట్ ఎన్నికల ప్రచార శంఖారావం

- March 09, 2026 , by Maagulf
56వ డిస్ట్రిక్ట్ ఎన్నికల ప్రచార శంఖారావం

మిచిగాన్—అమెరికాలో స్థిరపడి, విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తూ, తన మూలాలను మరువని మన తెలుగువాడు, ప్రముఖ సామాజిక కార్యకర్త అశోక్ బడ్డి మిచిగాన్ స్టేట్ రిప్రజెంటేటివ్ (State Representative) పదవికి 56వ డిస్ట్రిక్ట్ నుండి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 56వ డిస్ట్రిక్ట్ పరిధిలోని ప్రవాస భారతీయులు మరియు స్థానిక అమెరికన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొని అశోక్ బడ్డి గారికి సంఘీభావం తెలిపారు.

"మన తెలుగు సంస్కృతి నేర్పిన సేవా గుణం, కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. ఇప్పుడు నా అనుభవాన్ని మన కమ్యూనిటీ కోసం, ఈ 56వ డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం మిచిగాన్ స్టేట్ హౌస్‌లో వినియోగించాలనుకుంటున్నాను" అని అశోక్ బడ్డి భావోద్వేగంతో పేర్కొన్నారు. "రాజకీయాల కంటే ప్రజల అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ, సామాన్య ప్రజల గొంతుకను స్టేట్ క్యాపిటల్ ల్యాన్సింగ్‌లో వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అశోక్ బడ్డి గారికి మద్దతుగా పలువురు కీలక నాయకులు మరియు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. స్టేట్ సెనేటర్ మైక్ వెబ్బర్, MIGOP కో-చైర్ సన్నీ రెడ్డి, మరియు OCRP ఛైర్మన్ పాట్రిక్ వాన్స్ ఈ సభలో పాల్గొని అశోక్ బడ్డి నాయకత్వంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాగే స్టేట్ రిప్రజెంటేటివ్ టామ్ కున్, కౌన్సిల్ మెన్ మార్క్ గన్, మరియు తెలుగు కమ్యూనిటీ పిల్లర్స్ ప్రమోద్ గోపాల్, ఆనంద్ సిన్హా, వెంకట్ మంతెన, రఘు శంకర్మంచి, జాన్ రేనాల్డ్స్, శ్రీధర్ ఐత, శ్రీనివాస్ చిట్టలూరి మరియు చెంచు రెడ్డి పాల్గొని మన తెలుగు బిడ్డకు అండగా నిలిచారు.

అశోక్ బడ్డి తన ప్రసంగంలో 'ఇదే మన సమయం' (NOW IS OUR TIME) అనే నినాదాన్ని నొక్కి చెప్పారు. మిచిగాన్ రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ఆయన తన దార్శనికతను పంచుకున్నారు:
• కుటుంబాలకు ఆర్థిక భరోసా: నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గించడం.
• మెరుగైన విద్యా వ్యవస్థ: పాఠశాలల్లో భద్రతను పెంచడం, ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు మరియు మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యను అందించడం.
• మౌలిక సదుపాయాల అభివృద్ధి: డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా రోడ్లు మరియు రవాణా సౌకర్యాల ఆధునీకరణ కోసం కృషి చేయడం.
సభ ముగింపులో అశోక్ బడ్డి తన భార్యాపిల్లలను వేదికపైకి ఆహ్వానిస్తూ, తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కుటుంబ సభ్యులకు మరియు తెలుగు సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. "రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, మన ప్రాంత అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా అడుగులు వేద్దాం. ఇదే మన సమయం!" అని ఆయన పిలుపునిచ్చారు.

అశోక్ బడ్డి గురించి:
అశోక్ బడ్డి మిచిగాన్ 56వ డిస్ట్రిక్ట్ నుండి రిపబ్లికన్ పార్టీ తరపున స్టేట్ రిప్రజెంటేటివ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగు మూలాలున్న ప్రవాస భారతీయుడిగా, ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆయనకు గుర్తింపు ఉంది. "ప్రజలే ప్రథమం" (People Over Partisanship) అనే నినాదంతో, మన తెలుగు వారి గొంతుకను అమెరికా రాజకీయ వేదికపై బలంగా వినిపించడానికి ఆయన సిద్ధమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com