హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు

- March 11, 2026 , by Maagulf
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్‌లో ఉన్న బుర్ఖా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

మీర్‌చౌక్ పోలీసుల సమాచారం ప్రకారం షహ్రాన్ మార్కెట్‌లోని ఒక వాణిజ్య భవనం మూడో అంతస్తులో బుర్ఖా దుకాణం ఉంది. అక్కడ ఉపయోగిస్తున్న మినీ గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా ప్రారంభమైన మంటలు క్రమంగా దుకాణంలోని వస్తువులకు వ్యాపించాయి.

అగ్ని ప్రమాదం సమయంలో దుకాణంలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మంటలు వ్యాపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

రంజాన్ మాసం కావడంతో మార్కెట్ ప్రాంతంలో ఎక్కువ రద్దీ ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com