డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు

- April 08, 2026 , by Maagulf
డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు

విజయవాడ: విజయవాడ కమీషనరేట్ పరిధిలో డ్రగ్స్ అమ్మకాలను మరియు వాడకాన్ని పూర్తిగా అరికట్టడానికి సిపి రాజశేఖరబాబు నడుం బిగించారు. ఇందులో భాగంగా ‘డ్రగ్స్ పై దండయాత్ర- 2’ అనే వినూత్న కార్యక్రమాన్ని వాంబే కాలనీలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి మంగళవారం ప్రారంభించారు. గతంలో నిర్వహించిన మొదటి విడత యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని, సుమారు 3 లక్షల మంది డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారని సిపి తెలిపారు. ఈ రెండో విడతలో భాగంగా యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

నగరంలో డ్రగ్స్ ఎక్కువగా చేరవేసే 149 ప్రాంతాలను (హాట్‌స్పాట్స్) పోలీసులు గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ ప్రాంతాల్లో డ్రోన్లు మరియు ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) కెమెరాల ద్వారా అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. తనిఖీల కోసం ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేసి, అందులో 20 మంది పోలీసులు మరియు 10 మంది వైద్య సిబ్బందిని నియమించారు. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి డ్రగ్ టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వస్తే, వారిని శిక్షించకుండా బానిసత్వం నుండి విముక్తి పొందేలా కౌన్సెలింగ్ కేంద్రాలకు పంపిస్తారు.

రాబోయే జూన్ మరియు జూలై నెలల్లో విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సిపి వెల్లడించారు. ప్రతి కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే గంజాయి విక్రయిస్తున్న 25 మందిపై కఠినమైన పిట్ ఎన్.డి.పి.ఎస్ చట్టాన్ని ప్రయోగించామని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని, ఈ పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశా విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com