ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- April 10, 2026
అమరావతి: ప్రపంచ సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా రాజధాని అమరావతికి కీలక స్థానం కల్పించే దిశగా మరో చరిత్రాత్మక అడుగు పడుతోంది. నవశకం టెక్నాలజీ అయిన క్వాంటం కంప్యూటింగ్ రంగంలో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన స్వదేశీ క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏప్రిల్ 14న ప్రారంభించనున్నారు. ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరగనుంది.
గన్నవరంలోని మేధా టవర్స్లో ‘అమరావతి 1Q’ పేరుతో, రాజధాని పరిధిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ‘అమరావతి 1S’ పేరుతో రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్ బెడ్స్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీని విద్యార్థులు మరియు పరిశోధకుల కోసం ఓపెన్ యాక్సెస్ విధానంలో అందుబాటులో ఉంచనున్నారు.
దీంతో విద్యార్థులు క్వాంటం కంప్యూటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించి పరిశోధనలు చేయగల అవకాశాన్ని పొందనున్నారు.
క్వాంటం కంప్యూటింగ్ రంగంలో కేవలం సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్కే పరిమితం కాకుండా హార్డ్వేర్ తయారీలోనూ స్వయం సమృద్ధి సాధించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫెసిలిటీల్లో మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద పనిచేసే పరికరాలను పరీక్షించి సర్టిఫికేషన్ ఇవ్వనున్నారు.
ఇటీవలే 30కి పైగా క్వాంటం హార్డ్వేర్ తయారీ సంస్థలతో సీఎం సమావేశమై అమరావతిని దేశ క్వాంటం హార్డ్వేర్ నెట్వర్క్కు యాంకర్ నోడ్గా తీర్చిదిద్దాలని సూచించారు.
అమరావతిని ప్రపంచంలోని మొదటి ఐదు క్వాంటం హబ్లలో ఒకటిగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉద్దండరాయునిపాలెంలో 50 ఎకరాల్లో ‘అమరావతి క్వాంటం వ్యాలీ (AQV)’ నిర్మాణం చేపడుతోంది.
అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం భాగస్వామ్యంతో 133 క్యూబిట్ సామర్థ్యం కలిగిన క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానుంది. టీసీఎస్, ఎల్ అండ్ టీ, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వంటి సంస్థలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నారు.
నూతన ఔషధాల ఆవిష్కరణ, వాతావరణ అంచనాలు, సెమీకండక్టర్ డిజైన్, రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాల్లో పరిశోధనలకు ఈ కేంద్రం కీలక వేదిక కానుంది. ఇప్పటికే 80కి పైగా అంతర్జాతీయ సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. క్వాంటం టెక్నాలజీ నైపుణ్యాల అభివృద్ధి కోసం ఐదేళ్లలో 45 లక్షల మంది నిపుణులను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









