కార్మికుల కేసులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగింత..!!

- April 14, 2026 , by Maagulf
కార్మికుల కేసులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగింత..!!

కువైట్: కార్మికుల హక్కులను పరిరక్షించడం మరియు కార్మిక మార్కెట్‌ను నియంత్రించడంలో భాగంగా రెండు భారీ కార్మిక సమావేశాలపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) చర్యలు తీసుకుంది.

అథారిటీ ప్రకారం, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అందిన నివేదిక తర్వాత జరిగిన మొదటి సంఘటనలో 400 మందికి పైగా కార్మికులు గుమిగూడారు. కార్మిక సంబంధాల శాఖకు చెందిన ఒక ప్రత్యేక బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. భద్రతా అధికారుల సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

అనంతరం అధికారులు యజమానిని, కంపెనీ అధికారులను మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ తో మాట్లాడారు. కార్మిక చట్టాలు, నియామకాలు మరియు ఉపాధి పద్ధతులకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఈ కేసును జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించారు.

కార్మికులు, యజమానులు ఇద్దరి హక్కులను పరిరక్షిస్తూ.. ఇలాంటి కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అత్యవసర ఫిర్యాదుల బృందాలు 24/7 పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కార్మికులను కూడా ప్రశ్నించారు. ఉద్యోగులకు, యజమానికి మధ్య తలెత్తిన వివాదాలే సామూహిక సమ్మెకు దారితీసినట్లు తేలింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చట్టపరమైన, ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

మరుసటి రోజు, ఒక శాఖా కార్యాలయం సమీపంలో సుమారు 300 మంది కార్మికులు గుమిగూడినట్లు సమాచారం అందింది. ఈ గుంపును కూడా అధికారులు చెదరగొట్టారు. ఈ నిరసన వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

యజమానులు, కార్మికులు ఇద్దరూ కార్మిక చట్టాలు, ఒప్పందాలను పాటించాలని అధికార యంత్రాంగం కోరింది. సామూహికంగా పనిని నిలిపివేయడం గానీ, నిబంధనలను ఉల్లంఘించడం గానీ చేయరాదని హెచ్చరించింది. నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com