రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!

- May 05, 2026 , by Maagulf
రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!

ముంబై: బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాల పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో భారీగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

నకిలీ సర్టిఫికెట్లు..తప్పుడు వాగ్దానాలు
కొన్ని అనధికారిక సంస్థలు తాము బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) బకాయిలను రద్దు చేయిస్తామని నమ్మబలుకుతున్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది. ఇందుకు ప్రతిఫలంగా ‘సర్వీస్ ఛార్జీలు’ లేదా ‘లీగల్ ఫీజుల’ పేరుతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా, బ్యాంకు బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ నకిలీ ‘రుణ మాఫీ సర్టిఫికెట్లను’ కూడా జారీ చేస్తున్నట్లు కేంద్ర బ్యాంక్ దృష్టికి వచ్చింది. ఇవన్నీ పూర్తిగా అక్రమమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల ప్రజలు తమ రుణాలను సకాలంలో చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారే అవకాశం ఉందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.

సామాజిక మాధ్యమాల్లో లేదా ఇతర ప్రచార మాధ్యమాల్లో వచ్చే అనధికారిక రుణ మాఫీ ప్రకటనలను అస్సలు నమ్మకండి. మీ రుణానికి సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే, నేరుగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించండి. రుణం రద్దు చేయిస్తామని చెప్పే ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి ఫీజులు చెల్లించవద్దు. ఎవరైనా మిమ్మల్ని ఈ విధంగా సంప్రదించినట్లయితే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయండి. రిజర్వ్ బ్యాంక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఇలాంటి ముఠాల మాయలో పడి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని కేంద్ర బ్యాంక్ విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com