సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం

- June 09, 2026 , by Maagulf
సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం

హైదరాబాద్: పోలీసు శాఖ–మీడియా మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం, క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న “సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026” టోర్నమెంట్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్, ఐపీఎస్. సోమవారం ఘనంగా ప్రారంభించారు.

సైబరాబాద్ సీపీ కార్యాలయ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, అదనపు డీసీపీ షమీర్ పాల్గొన్నారు.జూన్ 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో పోలీసు అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులతో కూడిన పలు జట్లు పోటీపడనున్నాయి.

టోర్నమెంట్ తొలి రోజు జరిగిన మ్యాచ్‌లలో మల్కాజిగిరి మీడియా థండర్స్ జట్టు కెప్టెన్ వంశీ నాయకత్వంలో క్రైమ్ పార్ట్నర్స్ జట్టుతో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మల్కాజిగిరి మీడియా థండర్స్ జట్టు విజయం సాధించింది. అద్భుత ప్రదర్శన కనబర్చిన జెస్తాది రాజుకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

మరో మ్యాచ్‌లో ఎస్‌సీఎస్‌సీ డిఫెండర్స్ జట్టు కెప్టెన్ ప్రణవ్ సారథ్యంలో, శేరిలింగంపల్లి జట్టు కెప్టెన్ ఖాదిర్ నాయకత్వంలోని జట్టుతో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌సీఎస్‌సీ డిఫెండర్స్ జట్టు విజయం సాధించగా, అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన శివ కుమార్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా సీపీ డా.ఎం.రమేష్ మాట్లాడుతూ, పోలీసు శాఖ మరియు మీడియా ప్రతినిధుల మధ్య పరస్పర అవగాహన, సమన్వయం, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడంలో ఇటువంటి క్రీడా పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. క్రీడా స్ఫూర్తితో పాటు ఐక్యత, జట్టుగా పనిచేసే తత్వం, పరస్పర గౌరవాన్ని పెంపొందించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

“యునైటెడ్ ఇన్ స్పిరిట్–స్ట్రాంగర్ టుగెదర్” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11న సాయంత్రం జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com