సమాజం, మానవాళి అభ్యున్నతికి విద్యను వినియోగించాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్

- June 10, 2026 , by Maagulf
సమాజం, మానవాళి అభ్యున్నతికి విద్యను వినియోగించాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్

తిరుపతి: విద్యార్థులు తమకు లభించిన జ్ఞానం, నైపుణ్యాలను సమాజం మరియు మానవాళి అభ్యున్నతికి వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సూచించారు. తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన 63వ నుంచి 68వ సంయుక్త వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.

స్నాతకోత్సవ ప్రసంగంలో గవర్నర్ మాట్లాడుతూ, పట్టభద్రుల జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయమని, అవకాశాలు, బాధ్యతలు, సమాజ సేవతో కూడిన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో పొందిన విద్య కేవలం వ్యక్తిగత పురోగతికే కాకుండా సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని సూచించారు.

భారతదేశం ఆవిష్కరణలు, పరిశోధనల రంగంలో విశేష పురోగతి సాధించిందని గవర్నర్ తెలిపారు.పేదరికం, వ్యాధులు, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు, ఆకలి వంటి అనేక సామాజిక సవాళ్లకు పరిశోధనల ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా నిలిచి, గ్లోబల్ నాలెడ్జ్ మరియు ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతోందని పేర్కొన్నారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఆధునిక, అభివృద్ధి చెందుతున్న విభాగాలకు సంబంధించిన పలు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతుండటం అభినందనీయమని గవర్నర్ అన్నారు. ఇవి అంతరశాఖ పరిశోధనలు, శాస్త్రీయ సహకారం, సమాజాభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిష్కారాలకు దోహదపడతాయని చెప్పారు.

అలాగే డ్రోన్ పైలట్ శిక్షణ కోసం విశ్వవిద్యాలయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (RPTO) హోదా లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న పట్టభద్రులు, పరిశోధక విద్యార్థులు, స్వర్ణ పతక గ్రహీతలను గవర్నర్ అభినందించారు.

స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, సీఎస్‌ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మాండేలకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు (హానరిస్ కాజా) ప్రదానం చేసింది.

విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టాటా నరసింహారావు వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com