మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై జగన్ తీవ్ర ఆరోపణలు!

- June 11, 2026 , by Maagulf
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై జగన్ తీవ్ర ఆరోపణలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ (Mega DSC) నియామక ప్రక్రియ పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో భారీ ఎత్తున అక్రమాలు, పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ తీరును జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. “కేవలం 16 వేల ఉద్యోగాల భర్తీకే ఇన్ని స్కామ్‌లు, లీకులు కళ్లముందు కనిపిస్తున్నాయి. ఈ అరకొర పోస్టుల ప్రక్రియను చూస్తుంటే అసలు ఇందులో ‘మెగా’ అంటే ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. దీనిని అస్సలు మెగా డీఎస్సీ అని పిలవడానికి వీలులేదు, దానికి దీనికి ఏమాత్రం అర్హత లేదు” అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.


డీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరుపై జగన్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యాశాఖలో నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రక్రియను పక్కనబెట్టారని విమర్శించారు. డీఎస్సీ పరీక్షల పర్యవేక్షణలో కీలకమైన కన్వీనర్‌ పాత్రను కావాలనే పక్కనబెట్టారని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ బాధ్యతలను మొత్తం ‘రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి’ (SCERT) కి అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షల్లో ప్రశ్నాపత్రాల తయారీ నుండి వాటిని డిజిటల్ పద్ధతిలో కంప్యూటర్లలో నిర్వహించే వరకు ప్రతి దశ అత్యంత గోప్యంగా ఉండాలి. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ నమ్మకాన్ని, పారదర్శకతను పూర్తిగా గంగలో కలిపేసిందని, అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com