ఒమన్ తీరంలో మరో భారతీయ నౌకపై దాడి!

- June 11, 2026 , by Maagulf
ఒమన్ తీరంలో మరో భారతీయ నౌకపై దాడి!

ఇరాన్‌–అమెరికా మధ్య నడుస్తున్న తీవ్ర సైనిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు శాపంగా మారాయి. తాజాగా పశ్చిమాసియాలోని గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఒమన్‌లోని షినాస్‌ పోర్టుకు సమీపంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం తాము స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.


ప్రాథమిక నివేదికల ప్రకారం.. గినియా-బిస్సావు దేశపు జెండాతో ప్రయాణిస్తున్న ‘జలవీర్’ అనే ఆయిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ నౌకలో సుమారు 20 మంది భారతీయ నావికులు సిబ్బందిగా ఉన్నారు. దాడి కారణంగా నౌకలోని చిమ్నీ, ఇంజన్ రూమ్ పరిసరాల్లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయినప్పటికీ, అదృష్టవశాత్తూ నౌకలో ఉన్న భారతీయ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

వారం రోజుల్లోనే మూడో ఘటన..పెరిగిన ఆందోళన

గల్ఫ్ జలాల్లో భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం కేవలం వారం రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ వరుస దాడులు అంతర్జాతీయ షిప్పింగ్ రంగాన్ని, భారత నావికుల కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సెట్టెబెల్లో పలావు జెండాతో వెళ్తున్న ఈ ట్యాంకర్‌పై జరిగిన దాడి అత్యంత విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన 21 మందిని సురక్షితంగా రక్షించారు. అంతకుముందు జరిగిన మరో దాడిలో ‘మారివెక్స్’ అనే ట్యాంకర్ కాల్పులకు గురైంది. ఒమన్, భారత బలగాల సమన్వయంతో ఆ నౌకలోని 24 మంది భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

అమెరికా–ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యం

వెస్టేషియా ప్రాంతంలో భద్రతా పరిస్థితులు రోజురోజుకూ అత్యంత క్లిష్టంగా మారుతున్నాయి. అమెరికాకు చెందిన సైనిక హెలికాప్టర్‌ను కూల్చివేయడంతో రంగంలోకి దిగిన యూఎస్ బలగాలు ప్రతీకార దాడులు చేపట్టాయి. వీటికి ప్రతిగా ఇరాన్ సైన్యం కూడా క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడులకు దిగింది. ఈ రెండు దేశాల యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ జలమార్గాల్లో ప్రయాణించే సాధారణ వాణిజ్య నౌకలు ప్రమాదంలో పడుతున్నాయి. భారత సిబ్బంది లక్ష్యంగా జరుగుతున్న దాడులను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలకు భంగం కలిగించడం, అమాయక నావికుల ప్రాణాలను పణంగా పెట్టడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. తక్షణమే ఇరుపక్షాలు ఉద్రిక్తతలను తగ్గించుకుని, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని భారత్ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com