బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- July 26, 2026
మనామా: బహ్రెయిన్లో విదేశాల నుంచి వచ్చే విజిటింగ్ వైద్యులు నిర్వహించే ఆపరేషన్లపై మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలన్న ప్రతిపాదన పార్లమెంట్ ముందుకొచ్చింది. స్థానిక లైసెన్స్ పొందిన కన్సల్టెంట్ వైద్యుడి పర్యవేక్షణ లేకుండా విజిటింగ్ డాక్టర్లు ఆపరేషన్లు చేయకుండా, రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారే వరకు లేదా మరో నిపుణుడికి బాధ్యతలు అప్పగించే వరకు దేశం విడిచి వెళ్లకుండా నిబంధనలు తీసుకురావాలని ఎంపీ మహ్మద్ జనాహీ తన ప్రతిపాదనలో సూచించారు.
ఈ ప్రతిపాదన ప్రకారం, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లలో విజిటింగ్ డాక్టర్లు నిర్వహించే ఆపరేషన్లు, ఇతర క్లిష్ట వైద్య చికిత్సలకు సంబంధిత విభాగానికి చెందిన బహ్రెయిన్ లైసెన్స్ పొందిన కన్సల్టెంట్ వైద్యుడు తప్పనిసరిగా బాధ్యతలు చేపట్టాలి. పేషంట్ చికిత్సను పర్యవేక్షించడం, వైద్య బృందంతో సమన్వయం చేయడం, చికిత్స పూర్తయ్యే వరకు మరియు రోగి పరిస్థితి స్థిరపడే వరకు పూర్తి బాధ్యత వహించడం ఆ కన్సల్టెంట్ బాధ్యతగా ఉండాలని ప్రతిపాదించారు.
అలాగే, ఆపరేషన్ అనంతరం ప్రారంభ దశలో తలెత్తే సమస్యలను గమనించేందుకు విజిటింగ్ వైద్యులు కొంతకాలం బహ్రెయిన్లోనే ఉండాల్సి ఉంటుంది. రోగి పరిస్థితి స్థిరపడిన తర్వాత లేదా వెంటనే బాధ్యతలు స్వీకరించగల మరో కన్సల్టెంట్కు కేసును అప్పగించిన తర్వాతే వారు దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు కూడా విజిటింగ్ డాక్టర్లు చికిత్స చేసిన రోగుల కోసం అదే వైద్య విభాగానికి చెందిన కన్సల్టెంట్ను 24 గంటలు అందుబాటులో ఉంచాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు.
శస్త్రచికిత్స అనంతరం రోగులు సంబంధిత నిపుణుడి సేవలు లేక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడడమే ఈ ప్రతిపాదన లక్ష్యమని ఎంపీ మహ్మద్ జనాహీ తెలిపారు. విదేశీ వైద్యుల సేవలను పరిమితం చేయడం లేదా రోగులను వారి సేవలను దూరం చేయడం తమ ఉద్దేశం కాదని, ప్రతి కేసుకు బాధ్యత వహించే వైద్యుడు ఎవరో స్పష్టత ఉండేలా చేసి, ఆపరేషన్ తోనే వైద్య సేవలు ముగిసిపోకుండా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చేయడమే ఈ చర్యల ఉద్దేశమని ఆయన వివరించారు.
బహ్రెయిన్లో ప్రైవేట్ ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా ఆపరేషన్ తర్వాత మొదటి గంటలు, రోజుల్లో రోగి పరిస్థితి వేగంగా మారే అవకాశం ఉన్నందున మరింత పటిష్టమైన నిబంధనలు అవసరమని ఎంపీ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







