రహమాన్ తన సంగీత విన్యాసంతో ఉర్రూతలూగించారు..

- August 16, 2016 , by Maagulf
రహమాన్ తన సంగీత విన్యాసంతో ఉర్రూతలూగించారు..

అంతర్జాతీయ వేదికపై స్వరభారతి ఎంఎస్ సుబ్బులక్ష్మికి అపూర్వమైన స్వరార్చన జరిగింది. భారతజాతి గర్వించదగ్గ మహాగాయనికి విశ్వసంగీత చక్రవర్తి ఏఆర్ రహమాన్ ఐక్యరాజ్యసమితి వేదికగా అపురూపమైన నివాళిని అర్పించారు. 70వ భారత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హాల్‌లో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య రహమాన్ తన సంగీత విన్యాసంతో ఉర్రూతలూగించారు. భారతరత్న ఎంఎస్ సంగీతాన్ని, సూఫీ గీతాలను ఆలపించిన రహమాన్ తన మార్కింగ్ గీతమైన 'జయహో'తో భారత స్వాతంత్య్ర ఉత్సవాలకు అద్భుతమైన ముద్ర ఐరాస వేదికపై చూపించారు. ప్రపంచ దేశాల అధినేతలు సాధారణంగా ప్రసంగించే ఈ వేదికపై సరిగ్గా అర్ధ శతాబ్దం క్రితం ఎంఎస్ తన గానాలాపనతో ప్రపంచానికి కర్ణాటక సంగీత స్వరాలను పరిచయం చేశారు. తిరిగి యాభై సంవత్సరాల తరువాత మళ్లీ అదే వేదికపై భారతీయ సంగీత వైభవం ప్రదర్శితమైంది. ఐరాసలోని భారత శాశ్వత మిషన్, భారత్‌లోని పౌర సమాజ సంస్థ శంకర నేత్రాలయ అధ్వర్యంలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలో ఎంఎస్ శతజయంతి ఉత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో ఆమెకు నివాళిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1966 అక్టోబర్‌లో ఎంఎస్ ఈ వేదికపై తన కచేరీ నిర్వహించారు. ఇక్కడ కచ్చేరీ చేసిన తొలి భారతీయురాలు ఆమే. ఆ తరువాత మళ్లీ రహమాన్ తన సంగీతంతో అద్భుతాల్ని సృష్టించాడు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య వేదికపైకి వచ్చిన రహమాన్ బృందం దాదాపు మూడు గంటలపాటు నిరంతరాయంగా కచేరీ నిర్వహణ చేశారు. రహమాన్ బృందంలో ఆయన ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. 'దిల్‌సె', 'బాంబే' సినిమా పాటలతో పాటు, 'ఖ్వాజా మేరే ఖ్వాజా', 'కున్ ఫయాకున్', 'వౌలా, వౌలా', వంటి సూఫీ గీతాలు, స్లమ్‌డాగ్ మిలియనీర్‌లోని పాపులర్ గీతం 'జయహో' గీతాలను ఆలపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com