బొప్పాయి పండు ఆకుతో డెంగ్యూ వ్యాధికి చెక్ ..

- August 17, 2016 , by Maagulf
బొప్పాయి పండు ఆకుతో డెంగ్యూ వ్యాధికి చెక్ ..

ఇటీవల ప్రజలను భయపెడుతున్న వ్యాధులలో డెంగ్యూ ఒకటి. వ్యాధి వచ్చిన వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకచోట సరిగ్గా నిలుచోలేరు. కూర్చోలేరు. బెడ్‌కే పరిమితం కావల్సి వస్తుంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం క్షీణించి ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. డెంగ్యూ వచ్చిన వారి రక్తంలో ఉండే ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది. సాధారణ వ్యక్తుల్లో ప్లేట్‌లెట్లు 1.50 లక్షల నుంచి 4.50 లక్షల మధ్య ఉంటే, డెంగ్యూ వచ్చిన వారిలో 1.50 లక్షల కన్నా తక్కువగా ఉంటుంది. గంటలు అయిన కొద్దీ ఇవి వేల సంఖ్యలో పడిపోతూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడం కోసం వైద్యులు పలు రకాల మందులను, విటమిన్ సప్లిమెంట్లను రోగులకు అందిస్తారు.

 

రోగి కొద్దిగా కోలుకున్న తరువాత డిశ్చార్జి చేస్తారు. కానీ కొన్ని రోజుల వరకు వారు మందులను సక్రమంగా తీసుకోవాల్సిందే. సరైన ఆహారం తినాల్సిందే. లేదంటే రోగం మళ్లీ తిరగబెట్టేందుకు అవకాశం ఉంటుంది.

అలాంటి వారు కింద సూచించిన విధంగా ఓ చిట్కాను పాటిస్తే ప్లేట్‌లెట్ల సంఖ్యను త్వరగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది. ఇంతకీ ఆ మందు తయారయ్యేది బొప్పాయి ఆకులతోనే. బొప్పాయి ఆకులతో తయారు చేసిన ఓ మిశ్రమాన్ని సేవించడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్యను బాగా పెంచుకోవచ్చు.

ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలంటే కొన్ని బొప్పాయి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటిని మిక్సీలో వేసి దాంతో పాటు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు, ఒక టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపును కూడా వేయాలి. అనంతరం అన్ని పదార్థాలను బాగా మిక్సీ పట్టాలి. అప్పుడు వచ్చే ద్రవాన్ని వడబోసి, దానికి కొంత తేనె కలిపి నిత్యం రెండు పూటలా తీసుకోవాలి.

డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్‌తో పాటు ఈ మిశ్రమాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడే గుణం కనిపిస్తుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పెరగడమే కాదు, త్వరగా వ్యాధి నుంచి కోలుకుంటారు కూడా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com