కబాలి-2 నిర్మించనున్న ధనుష్

- August 29, 2016 , by Maagulf
కబాలి-2 నిర్మించనున్న ధనుష్

ఒక విజయం మనిషి దశనే మార్చేస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కబాలి చిత్రం భారతీయ సినిమా రికార్డులనే తిరగరాసిందన్నది మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవలసిన విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లను వసూలు చేసిన ఏకైక చిత్రం కబాలి. ఈ రికార్డును ఇప్పట్లో మరో భారతీయ చిత్రం టచ్ చేస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇంత భారీ వసూళ్లకు కారణం ఎవరన్న విషయం అందరికీ తెలిసిందే. ఎస్ ఆయనే సూపర్‌స్టార్ రజనీకాంత్. యువ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడి చేత కబాలిడా అనిపించింది. టాక్‌కు అతీతంగా కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం కబాలి.

ఇంత సంచలన విజయాన్ని సాధించిన చిత్ర దర్శకుడి తదుపరి చిత్రం ఏమై ఉంటుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.

రంజిత్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇంతకు ముందు సూర్య వెల్లడించారు. అయితే ఆయన ప్రస్తుతం ముత్తయ్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అంటే రంజిత్ చిత్రం డ్రాప్ అయినట్లే. కాగా కబాలి దర్శకుడితో ఇళయదళపతి విజయ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అదీ వాస్తవ రూపం దాల్చలేదు. తాజాగా రంజిత్ కబాలి సీక్వెల్‌కు కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం. 

ఈ చిత్రాన్ని తన అల్లుడు ధనుష్ ఉండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తారని, స్వయంగా సూపర్‌స్టారే దర్శకుడు రంజిత్‌కు చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కబాలి-1లో రజనీకాంత్ నటించే అవకాశం ఉందన్నది చెప్పకనే చెప్పినట్లయ్యింది కదూ. కాగా మన సూపర్ స్టార్ మరో సంచలనానికి సిద్ధం అవుతున్నారన్న మాట. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథ మార్థంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అప్పటికి రజనీకాంత్ తాజా చిత్రం 2.ఓ పూర్తి అవుతుందన్నది గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com