శాంతిపురం- రామకుప్పం మండలాల సరిహద్దు ప్రాంతంలో విమానాశ్రయం!

- September 06, 2016 , by Maagulf
శాంతిపురం- రామకుప్పం మండలాల సరిహద్దు ప్రాంతంలో విమానాశ్రయం!

కుప్పం నియోజకవర్గానికి మంజూరైన చిన్న తరహా విమానాశ్రయాన్ని శాంతిపురం- రామకుప్పం మండలాల సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కుప్పం సమగ్రాభివృద్ధిలో భాగంగా.. ఇక్కడ రైతు ప్రయోజనాల కోసం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదన మేరకు.. 2014లో కుప్పంలో చిన్న తరహా విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అనువైన స్థలం కోసం అప్పట్లో నియోజకవర్గ పరిధిలో మూడు చోట్ల భూముల పరిశీలన చేపట్టారు. గుడుపల్లె మండల పరిధి పొగురుపల్లె, శాంతిపురం మండలంలోని కడపల్లె, రామకుప్పం- శాంతిపురం మండలాల సరిహద్దున రామాపురం వద్ద భూములను పరిశీలించారు.
ఇందులో విమానాశ్రయం ఏర్పాటుకు రామాపురం, కడపల్లె వద్ద భూములు అనువైనవిగా నిర్ధరించారు. కడపల్లె వద్ద నిర్మిస్తే.. అన్ని విధాలా బాగుంటుందని నిర్ణయించగా..భూసేకరణ విషయమై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు.ముఖ్యమంత్రి పర్యటనతో మార్పు ఇటీవల కుప్పం నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. నియోజకవర్గ ముఖ్య నేతలతో నిర్వహించిన కోర్‌ కమిటీ సమావేశం సందర్భంగా విమానాశ్రయం అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. కుప్పం అభివృద్ధిలో విమానాశ్రయం కీలకం కానుందని, ఇది కార్యరూపం దాల్చితే బహుముఖ ప్రగతికి దోహదం చేయనున్నట్లు పేర్కొన్నారని తెలిసింది. రామకుప్పం, శాంతిపురం మండలాల సరిహద్దుల్లో అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రామకుప్పం మండల పరిధి కిలాకిపోడు, శాంతిపురం మండలంలోని అమ్మవారిపేట రెవెన్యూ పరిధిలో దాదాపు 1,020 ఎకరాల భూములున్నాయి. ఇందులో విమానాశ్రయానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసే విధంగా ప్రతిపాదనలు పంపనున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు. రెండు మండలాల సరిహద్దులో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు జరిగితే స్థానికంగా వాణిజ్య, ఉపాధి రంగాల్లో ప్రగతి వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు. విజలాపురం కేంద్రంగా కుప్పం, శాంతిపురం, రాజుపేట, వి.కోట రహదారులు రెండు వరసల దారిగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో విజలాపురం- కేజీఎఫ్‌ వయా శాంతిపురం రహదారిని డబుల్‌రోడ్డుగా మార్చడానికి రూ. 13.50 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com