దుబాయ్ వ్యాపారస్తుడ్ని మోసం చేసిన మహిళ

- September 10, 2016 , by Maagulf
దుబాయ్ వ్యాపారస్తుడ్ని మోసం చేసిన మహిళ

ఓ వ్యాపారవేత్తను డిన్నర్‌లో కలిసేందుకు ఐదునక్షత్రాల హోటల్‌కు వచ్చిన ఓ మహిళ రూ.46 లక్షల విలువచేసే చేతిగడియారంతోపాటు లక్షరూపాయల నగదును చోరీ చేసిన ఉదంతం న్యూఢిల్లీలో జరిగింది. దుబాయ్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న ఐదు నక్షత్రాల హోటల్ లో దిగారు. బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓ మహిళ వ్యాపారవేత్తను డిన్నర్ లో కలిసేందుకు రాత్రి హోటల్ కు వచ్చింది. అర్ధరాత్రిదాకా డిన్నర్ లో చర్చించిన వ్యాపారవేత్త మరునాడు ఉదయం కలుద్దామని ఆ మహిళతో చెప్పాడు. ఉదయాన్నే వ్యాపారి నిద్ర లేచి చూస్తే రూ.46 లక్షల విలువ చేసే తన చేతి గడియారం, పర్సులో ఉన్న లక్షరూపాయల నగదు కనిపించకపోవడం షాక్ కు గురయ్యాడు. 

 

హోటల్ సిబ్బందిని పిలిచి అడగ్గా, ఆ మహిళ తెల్లవారుజామున హోటల్ నుంచి వెళ్లినట్లు చెప్పారు. సదరు మహిళకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని వ్యాపారి చెప్పారు. రాత్రి తనతో కలిసి డిన్నర్ చేసేందుకు తన గదికి వచ్చిన మహిళ తన విలువైన చేతిగడియారం, లక్షరూపాయల నగదును చోరీ చేసిందని వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించి మహిళను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

 కాగా సదరు వ్యాపారవేత్తకు ఢిల్లీలో సొంత ఇల్లు ఉన్నా హోటల్ గదిలో దిగాడని పోలీసులు గుర్తించారు. తన వ్యాపార భాగస్వాములను కలిసేందుకు హోటల్ గదిలో దిగానని వ్యాపారి చెబుతున్నా పోలీసులు అసలు హోటల్ గదిలో ఏం జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com