పాకిస్థాన్‌ను 'ఉగ్రవాద ప్రోత్సాహక దేశం'గా పరిగణించాలని అమెరికా..

- September 21, 2016 , by Maagulf
పాకిస్థాన్‌ను 'ఉగ్రవాద ప్రోత్సాహక దేశం'గా పరిగణించాలని  అమెరికా..

పాకిస్థాన్‌ను 'ఉగ్రవాద ప్రోత్సాహక దేశం'గా పరిగణించాలని కోరుతూ అమెరికా చట్టసభలోని ఇద్దరు సభ్యులు యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. పాకిస్థాన్‌ పాల్పడుతున్న చర్యల కారణంగా ఆ దేశానికి అమెరికా సాయం నిలిపేయాలని.. పాక్‌ను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా గుర్తించాలని టెడ్‌ పోయ్‌ వెల్లడించారు. అమెరికా చట్టసభ ఉగ్రవాదంపై ఏర్పాటుచేసిన ఉపకమిటీకి టెడ్‌ ఛైర్మన్‌. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన టెడ్‌, డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన డానా రోహ్రబాచర్‌లు కలిసి 'పాకిస్థాన్‌ స్టేట్‌ స్పాన్సర్‌ ఆఫ్‌ టెర్రరిజం డిజిగ్నేషన్‌ యాక్ట్‌' (హెచ్‌ఆర్‌ 6069) బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

పాకిస్థాన్‌ నమ్మకాలను నిలబెట్టుకోకపోవడమే కాకుండా, అమెరికా శత్రువులకు ఇస్లామాబాద్‌ కొన్నేళ్ల పాటు ఆశ్రయమిచ్చిందని టెడ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ అక్కడ ఉండడమే కాకుండా.. అక్కడి నుంచి హాయిగా తన హఖ్ఖాని నెట్‌వర్క్‌తో సంబంధాలుకొనసాగించాడని అన్నారు. దీన్ని బట్టి ఉగ్రవాదంపై పోరు అంశంలో పాకిస్థాన్‌ వైఖరి ఎలాంటిదో తెలుసుకోవడానికి అవసరానికన్నా ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయని టెడ్‌ ఆరోపించారు. ఈ ప్రశ్నకు ఒబామా ప్రభుత్వం అధికారికంగా సమాధానం చెప్పాలని బిల్లులో కోరారు. పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతిస్తుందో, లేదో తెలియజేస్తూ 90 రోజుల్లో అధ్యక్షుడు నివేదిక ఇవ్వాలని టెడ్‌ కోరారు. తర్వాత ఫాలోఅప్‌ రిపోర్ట్‌లు అందజేయాలని అడిగారు.
భారత్‌లోని ఉరీ సైనికస్థావరంపై జరిగిన ఉగ్రదాడి అంశంపై న్యాయం చేకూరడానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతిస్తున్నట్లు అమెరికా చట్టసభ సభ్యుడైన పీట్‌ ఓల్సన్‌ మరో ప్రకటనలో వెల్లడించారు. భారత సైనికులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉరీ దాడిలో 18 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. దాడి చేసిన ఉగ్రవాదులను పాక్‌లోని జైషే-మహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందినవారుగా భావిస్తున్నారు. దీంతో పాక్‌ ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు పాక్‌ సురక్షిత ప్రాంతం కారాదని అమెరికా గట్టిగా చెప్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com