"కంట్రీ ఫస్ట్" అంటూ ఆర్మీకి ట్వీట్ ఇచ్చిన కేటీఆర్

- September 29, 2016 , by Maagulf

పీవోకేలో భారత బలగాలు మెరుపుదాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. పాక్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ చేయడంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కేటీఆర్ పూర్తి మద్దతు తెలిపారు. 'కంట్రీ ఫస్ట్' అనే ట్యాగ్ వర్డ్‌తో ఈ విషయంలో దేశమే ముఖ్యమని కేటీఆర్ చాటిచెప్పారు. ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైనికులను ప్రశంసించారు. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి బలంగా మద్దతునిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. తొలుత సీహెచ్ బీరేందర్ సింగ్‌తో భేటీ అయి బయ్యారం స్టీల్ ప్లాంటు గురించి చర్చించారు. అనంతరం రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ మెట్రో రైలుపై కేంద్రమంత్రితో చర్చించామని, రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరిగే మెట్రో పనులకు చార్జీలు వసూలు చేయడాన్ని నిలిపివేయాలని కోరామని, అందుకు సురేశ్ ప్రభు వెంటనే స్పందించడం తమకు ఆనందం కలిగించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కొద్ది సేపటి క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడితో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌తో పాటు పలు మున్సిపాలిటీలు బాగా దెబ్బతిన్నాయని, ఆర్థికంగా సాయం చేయాలని వెంకయ్యకు మంత్రి కేటీఆర్ వినతి పత్రం సమర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com