పాక్ సైన్యం ఆధీనంలో ఓ భారత జవాను...

- September 30, 2016 , by Maagulf
పాక్ సైన్యం ఆధీనంలో ఓ భారత జవాను...

పాక్ సైన్యం ఆధీనంలో ఓ భారత జవాను చిక్కుకున్న విషయాన్ని కేంద్రం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్రువీకరించారు. అతడిని విడిపించేందుకు పాక్ ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు శుక్రవారం రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. పొరపాటున సరిహద్దు దాటిన భారత జవాన్‌ని విడిచిపెట్టాలని రాజ్‌నాథ్ ఇప్పటికే పాక్‌ను కోరారు.
పాక్ ఆధీనంలో ఉన్న జవాన్‌ని మహారాష్ట్రకు చెందిన చందు బాబులాల్ చౌహాన్‌గా గుర్తించారు. అయితే దీనిపై పాకిస్థాన్ ఇంతవరకూ స్పందించలేదు. అతనిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, తోటి జవాన్ పాక్‌కు చిక్కడంపై సైనికులు ఆందోళనలో ఉన్నారు.
అతడికి ఏమీ కాకూడదని దేవుడిని ప్రార్ధిస్తున్నారు.

భారత జవాన్ తన ఆయుధాన్ని తీసుకొని అనుకోకుండా ఎల్‌ఓసీని దాటుకొని పాక్ వైపు వెళ్లారని, ఈ విషయాన్ని పాక్‌ సైన్యానికి తెలియజేశామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇలా అనుకోకుండా సరిహద్దులు దాటిన వారిని వెనక్కి పంపించిన ఘటనలు గతంలో కూడా ఇరువైపుల నుంచి జరిగాయని గుర్తుచేసింది.
అయితే సరిహద్దులో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో పాకిస్థాన్ దీనిపై ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు చందు బాబులాల్ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలని అతడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
పీఓకేలోని పూంచ్ జిల్లా టట్టాపానీ వద్ద ఉన్న నియంత్రణరేఖ వద్ద భారత్ పాకిస్థాన్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిదిమంది భారత సైనికులు, ఇద్దరు పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, ఒక భారతీయ జవానును పాక్ దళాలు ప్రాణాలతో పట్టుకున్నాయని డాన్ వెబ్‌సైట్ తొలుత వెల్లడించింది.
కాగా, ఈ వార్తలను పాకిస్థాన్ సైన్యం ధ్రువీకరించలేదు. దీంతో తన కథనాన్ని గురువారం రాత్రి డాన్ పత్రిక తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. మరో విషయమేమంటే 37 మంది రాష్ట్రీయ రైఫిల్స్ సోల్జర్స్‌ను పాకిస్తాన్ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే పీఓకేలోని పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం నిర్వహించిన దాడులపై పాక్ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఐక్యరాజ్య సమితిలో పాక్ రాయబారి మహీలా లోధి శుక్రవారం యూఎన్ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ను కలిసి పరిస్థితిని వివరించారు.
భారత్ తమ భూభాగంలోకి చొరబడి దాడులు చేసిందని ఆయన బాన్ కీ మూన్‌కి వెల్లడించారు. అనంతరం లోధి మీడియాతో మాట్లాడారు. భారత్ జరిపిన మెరుపుదాడిలో పాక్ సైనికులు సైతం మరణించారని తెలిపారు. మా సహనాన్ని పరీక్షించవద్దని సూచించారు. ఎల్ఓసీ వెంబడి తమ సైన్యాన్ని అప్రమత్తం చేశారమని అన్నారు.
భారత్ చెబుతున్నట్టు పాక్‌పై సర్జికల్ స్రయిక్స్ లాంటిదేమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే జరిగిందని, ఇరు దేశాల మధ్య కాల్పులు మాత్రమే జరిగాయని తెలిపారు. ఈ కాల్పుల్లో 
ఎనిమిది మంది భారత సైనికులు మరణించారని, మహారాష్ట్రకు చెందిన చందు బాబులాల్ చౌహాన్(22) అనే జవాన్‌ను బందీగా పట్టుకున్నామని లోధి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com