ఏపీ ప్రభుత్వం మరో ప్రాజెక్టుకి శ్రీకారం

- October 15, 2016 , by Maagulf
ఏపీ ప్రభుత్వం మరో ప్రాజెక్టుకి శ్రీకారం

ఏపీ ప్రభుత్వం మరో సాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. గోదావరిపై పురుషోత్తమపట్నం ఎత్తిపోతలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. పట్టిసీమ స్ఫూర్తితో చేపట్టనున్న పథకం ద్వారా.. పోలవరం కుడికాల్వ నుంచి విశాఖ జిల్లాకు 24 టీఎంసీలు తరలిస్తారు. అదే జరిగితే స్టీల్‌సిటీ నీటి కష్టాలు తీరినట్టే. విశాఖ నగర తాగు, పరిశ్రమల అవసరాలకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి పరిపాలన అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం 16 వందల 38 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నుంచి ఏలేరు రిజర్వాయర్‌కు మూడున్నర వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. ఇందులో 24 టీఎంసీలను విశాఖలోని పరిశ్రమలకు, గృహ అవసరాల కోసం కేటాయిస్తారు. విశాఖ జిల్లాలోని 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు జలవనరుల శాఖ ప్రణాళికలు రూపొందించింది. పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రస్తుత లెక్కల ప్రకారం 1704 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినా, గత అంచనాల మేరకే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 
గోదావరిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రికార్డ్ సమయంలో పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మించి.. అక్కడి నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తోంది. నదుల అనుసంధానంతో చరిత్ర స్పష్టించారు చంద్రబాబు. ఆ స్ఫూర్తితోనే పురుషోత్తమపట్నం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కీ ముఖ్యమంత్రి ప్లాన్ చేశారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు..అంతకంటే ముందే ఎడమ కాల్వ ద్వారా విశాఖకు తాగు, సాగు నీరు అందించేందుకు ప్రణాళికలు రచించారు. ఇటీవల విశాఖ పర్యటనలోనూ గోదావరి జలాలు అందిస్తామని హామీ ఇచ్చారాయన. పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ద్వారా ఆ హామీని అమలు చేయబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com