ఈజిప్ట్‌ మాజీ అధ్యక్షుడికి 20 ఏళ్ల జైలు

- October 23, 2016 , by Maagulf
ఈజిప్ట్‌ మాజీ అధ్యక్షుడికి 20 ఏళ్ల జైలు

మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీకి ట్రయల్‌ కోర్టు విధించిన న్యాయస్థానాన్ని ఈజిప్ట్‌ సర్వోన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. 2012 ద్వితీయార్థంలో దేశాధ్యక్ష పదవి నిర్విహించిన మోర్సీ తన మద్దతుదారులకు, ప్రత్యర్థులకు మధ్య ఘర్షణలను రెచ్చగొట్టి కనీసం పది మంది వ్యక్తుల మరణానికి కారకుడయ్యారన్న ఆరోపణలపై విచారించిన ట్రయల్‌ కోర్టు ఆయనకు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మోర్సీ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం కోర్ట్‌ ఆఫ్‌ కస్సాషన్‌ జైలుశిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పును వెలువరించింది.

ముస్లిం బ్రదర్‌హుడ్‌ అగ్రనేత మహ్మద్‌ బడీ, మాజీ మంత్రి బస్సెమ్‌ ఉడాతో సహా మరో ఆరుగురికి విధించిన 25 ఏళ్ల జైలుశిక్షను రద్దుచేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవే అభియోగాలతో వీరిపై వేర్వేరు కోర్టుల్లో పునర్విచారణ కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఏడాది పాలనపై ప్రజల్లో వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో దేశాధ్యక్ష పదవిలో కొనసాగిన మోర్సీని సైన్యం 2013 జులైలో పదవి నుండి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం సైనిక ప్రభుత్వం ఆయన మద్దతుదారులు, ఎక్కువ మంది బ్రదర్‌హుడ్‌ కార్యకర్తలపై ఉక్కుపాదం మోపటంతో దాదాపు వెయ్యి మంది మరణించగా వేలాది మంది అరెస్టయ్యారు.

ప్రభుత్వం ఈ సంస్థను ఉగ్రవాద జాబితాలో చేర్చి నిషేధం విధించింది. మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా 2011లో జరిగిన ప్రజాందోళనలో జైలును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై మోర్సీ, మరో 106 మంది బ్రదర్‌హుడ్‌ మద్దతుదారులకు 2015 మేలో కోర్టు మరణశిక్ష విధించింది. తరువాత గత ఏడాది జూన్‌లో హమాస్‌, హిజ్బుల్లా గ్రూపులతో కలిసి కుట్ర పన్నిన ఆరోపణలపై మోర్సీకి 25 ఏళ్ల జైలు విధిస్తూ ఒక క్రిమినల్‌ కోర్టు తీర్పు వెలువరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com