ఐఎస్‌ఐఎస్‌లో పది మంది భారతీయ యువకులు ఉన్నారు

- August 28, 2015 , by Maagulf
ఐఎస్‌ఐఎస్‌లో పది మంది భారతీయ యువకులు ఉన్నారు

ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో పది మంది భారతీయ యువకులు ఉన్నారు. వారు ఇరాక్‌, సిరియాల్లో ఆ సంస్థ తరుఫున పలు దాడుల్లో పాల్గొంటున్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్‌లు జరిపిన ఓ సమావేశంలో భాగంగా ఆస్ట్రేలియా ఈ విషయాన్ని భారత్‌కు తెలిపింది. ఐఎస్‌ఐఎస్‌కి ఆకర్షితులై భారత్‌ నుంచి ఆ ఉగ్రవాద సంస్థలోకి భారత యువకులు వెళుతున్న అంశంపై కేంద్ర హోంశాఖ గతంలోనే స్పందించింది. దీనిపై కేంద్ర హోంశాఖ 12 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు అధికారులతో ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చించింది. కాగా, భారత్‌ అనుకున్న దానికంటే ఇప్పుడు ఆస్ట్రేలియా చెబుతున్న భారతీయుల సంఖ్య అధికంగా ఉంది. అయితే ఆస్ట్రేలియా పరిస్థితితో పోల్చితే ఇది చాలా తక్కువే. యువతకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా వారు ఉగ్రవాదంవైపు ఆకర్షితులు కాకుండా భారత్ చూస్తోంది. కాగా, ఇటీవల 17మంది భారతీయ యువకులు అదృశ్యమైన విషయం తెలిసిందే. వారు కూడా ఐఎస్ఐఎస్‌లో చేరి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించిన మరో 22 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, ఆస్ట్రేలియా నుంచి 150 మంది యువత ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి ఇరాక్‌, సిరియా వెళ్లినట్లు తెలుస్తోంది. వారిలో 60 మంది అక్కడే పనిచేస్తున్నట్లు తెలిసిందని, 30 మంది తిరిగివచ్చారని అక్కడి అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com