తెలుగు మహిళ మృతి పై పూర్తి కాని విచారణ

- December 20, 2016 , by Maagulf
తెలుగు మహిళ మృతి పై పూర్తి కాని విచారణ

పొట్టకూటి కోసం ఎడారి దేశం వచ్చి ఇక్కట్ల పాలయిన ఓ తెలుగు మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సౌదీలోని శరణాలయంలో తలదాచుకుంటున్న ఆమెను సొంతఊరు పంపేందుకు ఓ ఎన్నారై సాయమందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన అడిదేల శాంత కుమారి అనే మహిళ కుటుంబ పరిస్థితులు బాగాలేక ఉపాధి కోసం సౌదీ వెళ్లింది. అక్కడకు వెళ్లిన తర్వాత భాష రాక, యజమాని పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకపోయింది. యజమానికి చెప్పకుండా పారిపోయింది. ఆ తర్వాత పోలీసుల ఆధ్వర్యంలో నడిచే ఓ మహిళా శరణాలయానికి వచ్చి కొంతకాలంగా బతుకు వెళ్లదీస్తోంది. ఆమె పరిస్థితిని గమనించిన అల్ ఖోబర్‌లో ఉండే ప్రవాసాంధ్రుడు, ఏపీ ఎన్నార్టీఎస్ కోఆర్డినేటర్ రావి రాధాకృష్ణా.. శాంత కుమారిని స్వస్థలానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారతీయ ఎంబసీ వాలంటీర్లు  యజమానిని ఒప్పించి ఆమెపై  కేసును ఉపసంహరించుకునేలా కృషి చేసి వీసా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ఇప్పించారు. సౌదీ నుంచి హైదరాబాద్‌కు వీసా టిక్కెట్టును రాధాకృష్ణ తీసుకున్నారు. వీరందరి సాయంతో శాంతకుమారి సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది.  కాగా సౌదీలో ఆత్మహత్య చేసుకున్న చిత్తూరు జిల్లా కెవి పల్లె మండలానికి చెందిన ఎంబిలీ సుశీల అనే మహిళ మృతదేహాన్ని భారత్‌కు పంపించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాధాకృష్ణ వెల్లడించారు.  ఆమె ఆత్మహత్య గురించి కేసు ఇంకా పూర్తి కానందున మృతదేహాన్ని అధికారులు అప్పగించడం లేదన్నారు. కేసు పూర్తయి, పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మృతదేహాన్ని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com