ఆన్‌లైన్‌లోనే హజ్‌ యాత్రకు దరఖాస్తులు

- January 02, 2017 , by Maagulf
ఆన్‌లైన్‌లోనే హజ్‌ యాత్రకు దరఖాస్తులు

డిజిటల్‌ ఇండియా దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు అనుగుణంగా వీలైనన్ని విభాగాల్లో డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ముస్లింల పవిత్ర హజ్‌యాత్రకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఆన్‌లైన్‌ చేశారు. 'దేశంలో తొలిసారి హజ్‌యాత్రకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ డిజిటల్‌ వేదికగా జరగనుంది' అని మైనారిటీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు.

డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా అభివర్ణించారు. 'మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డిజిటల్‌ ఇండియా దిశగా అడుగులు వేస్తోంది.

హజ్‌ యాత్రకు సంబంధించిన ప్రక్రియను ఆన్‌లైన్‌ చేశాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ సౌకర్యవంతంగా, పారదర్శకంగా ఉంటుంది' అని నఖ్వీ పేర్కొన్నారు.
హజ్‌యాత్రకు సంబంధించిన మొబైల్‌యాప్‌ను సైతం ప్రారంభించినట్లు నఖ్వీ తెలిపారు. గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. నేటి నుంచి హజ్‌యాత్రకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని జనవరి 24 వరకు ముస్లింలు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు.
యాత్రకు సంబంధించిన సమాచారం, వార్తలు, అప్‌డేట్లు, ఈ-పేమెంట్‌లతో యాప్‌ను రూపొందించారు. అప్లికేషన్‌ సైతం యాప్‌లోనే పొందుపరిచారు. ఐదుగురు పెద్దలు ఇద్దరు చిన్నారులు ఒక బృందంగా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. పీడీఎఫ్‌ కాపీ దరఖాస్తు దారు ఈ-మెయిల్‌ చిరునామాకు వెళ్తుంది. అన్ని వివరాలను నింపిన దరఖాస్తుపై ఫొటోను అంటించి స్టేట్‌ హజ్‌కమిటీలకు పంపాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజును సైతం యాప్‌ ద్వారా చెల్లించవచ్చు. మరిన్ని వివరాలు హజ్‌యాత్రకు సంబంధించి ప్రభుత్వం ప్రారంభించిన వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com