కొరియా సంస్థల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్క్‌: కేటీఆర్‌

- January 19, 2017 , by Maagulf

కొరియా సంస్థల కోసం రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తోన్న ఆయన అక్కడి కంపెనీల ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అక్కడి భారత రాయబారి విక్రం దొరైస్వామి అధ్యక్షతన జరిగిన వ్యాపారవేత్తల సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. పరిశ్రమలకు ఏకగవాక్ష అనుమతుల విధానం, పక్షం రోజుల్లో ఖచ్ఛితమైన అనుమతులు, తదితర అంశాలను వివరించారు. కొరియన్‌ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ ఆకర్షణీయ ప్రాంతంగా కేటీఆర్‌ అభివర్ణించారు.

ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఆటోమోటివ్‌, మిషనరీ, ఇంజినీరింగ్‌ వంటి రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సౌకర్యాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అభినందించిన కొరియన్‌ ప్రతినిధులు.. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి కొరియన్‌ కంపెనీకి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన సీనియర్‌ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయిన కేటీఆర్‌.. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ తయారీకి ఉన్న అవకాశాలు, ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక విధానం, అందుబాటులో ఉన్న మౌలిక వసతులను వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com