కానీ మా పరువు తీయొద్దు: మొత్తుకుంటున్న మంత్రి నాయని...

- January 31, 2017 , by Maagulf
కానీ మా పరువు తీయొద్దు: మొత్తుకుంటున్న మంత్రి నాయని...

ఒక వైపేమో మద్యశాఖ ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని పోగొట్టుకోకూడదు. మరోవైపేమో తాగుబోతులు వాహనాలతో విచ్చలవిడిగా రోడ్లమీదికి వచ్చి మనుషుల ప్రాణాలను తీస్తూ ప్రభుత్వ పరువు తీయొద్దు. ఈ డబుల్ జంజాటనలో పడ్డ తెలంగాణ సీనియర్ మంత్రి తాగుబోతులను అడుక్కుంటున్నారు. ఆయనిచ్చే పిలుపు ఏదో తెలుసా.. ఎంతైనా తాగండ్రా బాబూ.. తాగి ఇంట్లోనే ఉండండి. అంతేకాని ఇంటిబయటకు వచ్చి నానా అఘాయిత్యాలు చేసి మా పరువు తీయొద్దు.
మంత్రిగారికి ఇంత కష్టం ఎదుకొచ్చింది అంటే చానా కథే ఉంది మరి. తాగి వాహనాలు నడపడంతో తెలంగాణలో 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణలో ఏటా ఏడు వేల మంది మరణిస్తున్నారు. 23వేల మంది గాయాలబారిన పడుతున్నారు అంటూ ట్రాఫిక్ విభాగం వారు తెలిపిన గణాంకాలతో తెలంగాణ ప్రభుత్వానికి బైర్లు కమ్ముతున్నాయి. అందుకే హైద్రాబాద్‌లో ట్రాఫిక్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు పెట్టి మరీ తాగుబోతులకు సుద్దులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో మంగళవారం 'యాక్సిడెంట్‌ ఫ్రీ డే' సందర్భంగా నిర్వహించిన ట్రాఫిక్‌ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాయని నరసింహారెడ్డి ఇదే పాట అందుకున్నారు. ''మద్యం ఎంతైనా తాగండి. కానీ ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకొచ్చి అమాయకుల ప్రాణాలను హరించొద్దు. ఇలా తప్పుడు పనులతో మీ తల్లిదండ్రుల పరువునూ తీయొద్దు. ఎందుకంటే తాగి వాహనాలు నడపడంతో తెలంగాణలో 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణలో ఏటా ఏడు వేల మంది మరణిస్తున్నారు. 23వేల దాకా గాయాలబారిన పడుతున్నారు''
మంత్రిగారికి తెలుసో తెలియకో అలా అన్నారు కానీ పీకల దాకా తాగిన తర్వాత ఆమాత్రం రోడ్డుమీదికి వచ్చి తందనాలాడకపోతే.. రయ్ రయ్ లతో రోడ్లను రప్పాడించకపోతే తాగుబోతులనే పదానికి అర్దమేముంది మరి. ఇక ప్రాణాలు పోవడం అంటారా.. పోయిన వాళ్ల ఖర్మ, మిగిలిన వాళ్ల భాగ్యం.
తాగుడు లేకుండా చేయడం ఎలా అనే అంశాన్ని పక్కనబెట్టేసి బాగా తాగండి. తాగి ఇంట్లో బజ్జోండి అంటే అది అయ్యే పనేనా మంత్రి గారూ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com