ఇక అందులో జీమెయిల్‌ పనిచేయదు.!

- February 02, 2017 , by Maagulf
ఇక అందులో జీమెయిల్‌ పనిచేయదు.!

గూగుల్‌కు చెందిన జీమెయిల్‌ ఈ ఏడాది చివరి తర్వాత క్రోమ్‌ బ్రౌజర్‌ పాత వెర్షన్లలో పనిచేయదని ఆ సంస్థ గురువారం వెల్లడించింది. అదే విధంగా విండోస్‌కు పాత ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (ఓఎస్‌లు) అయిన ఎక్స్‌పీ, విస్తా వాడుతున్న కంప్యూటర్లలో కూడా ఇకపై జీమెయిల్‌ పనిచేయదని స్పష్టంచేసింది. వినియోగదారుల భద్రత రీత్యా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. గూగుల్‌ తాజాగా తన క్రోమ్‌ బ్రౌజర్‌ వెర్షన్‌ 55ను తీసుకొస్తోంది. ఇందులో పలు భద్రతా అంశాలను మెరుగుపరిచారు. కాగా, ఈ నెల 8 నుంచి క్రోమ్‌ వెర్షన్‌ 53 కంటే పాతది వాడుతున్న వారికి జీమెయిల్‌ ఓపెన్‌ చేస్తే ఇకపై అప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తూ ఓ బ్యానర్‌ కనిపించనుంది.

మరోవైపు మైక్రోసాఫ్ట్‌ తన పాత ఓఎస్‌లు అయిన ఎక్స్‌పీ, విస్తా విషయంలో రెండున్నరేళ్ల క్రితమే తన సపోర్ట్‌ను ఉపసంహరించుకుంది. అయితే ఇప్పటికీ చాలా మంది వాటినే వాడుతున్నారు. వాటిల్లో క్రోమ్‌ వెర్షన్‌ 49 కంటే పాతవి మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత వచ్చిన వెర్షన్లు ఈ కంప్యూటర్లలో పనిచేయవు. ఇప్పటి వరకు జీమెయిల్‌ ఆ కంప్యూటర్లలో కూడా పనిచేస్తూ వస్తోంది. అయితే వినియోగదారుల ఖాతాల భద్రత దృష్ట్యా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. క్రోమ్‌ తాజా వెర్షన్లకు అప్‌గ్రేడ్‌ అవ్వాలని సూచిస్తోంది. అంటే జీమెయిల్‌ వినియోగించాలంటే ఇక కొత్త ఓఎస్‌లకు మారక తప్పని పరిస్థితి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com