ఈజిప్టుకు చెందిన ప్రపంచంలోనే బరువైన మహిళ ముంబయిలో...

- February 10, 2017 , by Maagulf
ఈజిప్టుకు చెందిన ప్రపంచంలోనే బరువైన మహిళ ముంబయిలో...

ముంబయి: ఈజిప్టుకు చెందిన ప్రపంచంలోనే బరువైన మహిళ, 500కిలోల ఎమన్‌ అహ్మద్‌ శనివారం ఉదయం చికిత్స నిమిత్తం ముంబయిలోని సైఫీ ఆస్పత్రికి రానున్నారు. 25 సంవత్సరాలుగా అధిక బరువు కారణంగా కైరోలోని తన ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయిన ఆమె ఎట్టకేలకు చికిత్స నిమిత్తం ప్రయాణమవుతున్నారు. ఎమన్‌ ప్రయాణం కోసం ఈజిప్టు ఎయిర్‌కి చెందిన ఎయిర్‌బస్‌ 300-600కార్గో విమానంలో స్వల్ప మార్పులు చేశారు. అలెగ్జాండ్రియాలోని బోర్గ్‌ ఎల్‌ అరబ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం శుక్రవారం రాత్రి బయల్దేరి శనివారం తెల్లవారుజామున ముంబయి చేరుకుంటుంది. దాదాపు ఆరుగంటలు పట్టే ఈ ప్రయాణంలో ఎమన్‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎమన్‌ అహ్మద్‌ చికిత్స నిమిత్తం సైఫీ ఆస్పత్రి ప్రధాన భవనం పక్కనే నిర్మించిన భవనాన్ని సరైన అనుమతులు లేవని ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూల్చేసింది. దీంతో ఆ ప్రాంతానికి కొద్ది దూరంలో మరో భవనాన్ని నిర్మిస్తున్నారు. చికిత్స నిమిత్తం ఎమన్‌ ఇక్కడ కొన్ని నెలల పాటు ఉండాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. సైఫీ ఆస్పత్రి కన్సల్టెంట్‌ బేరియాట్రిక్‌ సర్జన్‌ డా.ముఫ్ఫజల్‌ లక్డావాలా నేతృత్వంలోని వైద్య బృందం ఎమన్‌కు చికిత్స చేయనున్నారు.

చికిత్స అనంతరం కొంతకాలం పాటు ఎమన్‌ సంరక్షణ బాధ్యతలను కూడా వారే చూసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com