20 నిమిషాల్లో చెన్నై నుంచి బెంగళూరుకి చేరుకోవచ్చట!

- March 05, 2017 , by Maagulf
20 నిమిషాల్లో చెన్నై నుంచి బెంగళూరుకి చేరుకోవచ్చట!

చెన్నై నుంచి బెంగళూరు మధ్య దూరం 342 కిలోమీటర్లు. బస్సులో వెళ్తే 7 గంటలు... ఎంత త్వరగా వెళ్లినా ఆరున్నర గంటలు. రైలు ప్రయాణమైనా కొద్దిగా అటూఇటుగా అదే సమయం పడుతుంది. విమానంలో వెళితే గంటకు పైగానే ప్రయాణం చేయాలి. ఇప్పుడీ లెక్కలన్నీ ఎందుకని కొట్టిపారేయకండి. చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు జర్నీ టైం మరింత తగ్గనుంది. ఎంతంటే ఎవరూ ఊహించనంత. కేవలం 20 నిమిషాల్లో చెన్నై నుంచి బెంగళూరు వెళ్లొచ్చట. లాస్ ఎంజెల్స్‌కు చెందిన హైపర్‌లూప్ వన్ కంపెనీ ఇండియాలో ఐదు సరికొత్త రైల్వే లైన్లను నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభూనే వెల్లడించడం విశేషం. శనివారం చెన్నైలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.
ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల వేగాన్ని పెంచాలని తాము భావిస్తున్నామని సురేష్ ప్రభు తెలిపారు. హై స్పీడ్ ట్రైన్స్, సెమీ హై స్పీడ్ ట్రైన్స్‌ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ హై స్పీడ్ టెక్నాలజీ ట్రైన్స్‌ను పరిచయం చేసేందుకు హైపర్‌లూప్ వన్ కంపెనీ సహకారం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. చెన్నై టూ బెంగళూరు లైన్‌తో పాటు ముంబై టూ కోల్‌కత్తా వయా చెన్నై(220 నిమిషాలు), ముంబై టూ చెన్నై వయా బెంగళూరు(1,102కిలోమీటర్లు, 50 నిమిషాలు) లైన్లు కూడా హైపర్ లూప్ వన్ కంపెనీ ముందుంచింది రైల్వే శాఖ.

వేగాన్ని పెంచి, ప్రయాణ వ్యవధిని తగ్గించడం ద్వారా చెన్నై, ముంబై నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరుగుతాయని, నౌకా మార్గాన్ని ఆశ్రయించే వారికి ఇదో ప్రత్యామ్నయంగా తోడ్పాటునందిస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com