వలసదారుల కేసుల పరిష్కారం కోసం అమెరికాలోని ప్రత్యేక న్యాయమూర్తులు

- March 10, 2017 , by Maagulf
వలసదారుల  కేసుల పరిష్కారం కోసం  అమెరికాలోని ప్రత్యేక న్యాయమూర్తులు

- 50 మందిని నియమించిన అమెరికా న్యాయశాఖ 
 అమెరికాలోని వలసదారుల కేసుల పరిష్కారం కోసం 50 మంది ప్రత్యేక న్యాయమూర్తులను నియమించినట్టు శుక్రవారం ఆదేశ న్యాయశాఖ పేర్కొంది. పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారమే తమ ముందున్న లక్ష్యమని తెలిపింది. కాగా, ఏడు ముస్లిం దేశాలకు ( ఇరాన్‌, ఇరాక్‌, సిరియా, సుడాన్‌, సోమాలియా, లిబియా, యెమెన్‌ ) చెందిన వలసదారులను 90 రోజుల పాటు, సిరియా శరణార్థులను 120 రోజుల పాటు అమెరికాలో నిషేధించినట్టు జనవరి 27న ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్‌ ఆదేశాల పట్ల అనేక దేశాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.
మెజారిటీ అమెరికన్లు ట్రంప్‌ ఆదేశాలను వ్యతిరేకించడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం విమానాశ్రయ అధికారులు వలసదారులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. పలువురిని నిర్భంద కేంద్రాల్లో నిర్భందించారు. దీంతో, ట్రంప్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొంత మంది వలసదారులు అమెరికా కోర్టులను ఆశ్రయించారు. వలసదారుల వాదనలతో ఏకీభవించిన యూఎస్‌ ఫెడరల్‌ కోర్టు ట్రంప్‌ ఆదేశాలను నిలుపుదల చేసింది. అంతేగాకుండా, యూఎస్‌ అప్పీల్స్‌ కోర్టులోనూ ట్రంప్‌ సర్కార్‌కు చుక్కెదురైంది. దీంతో, ఇరాక్‌ దేశాన్ని మినహాయించి ట్రంప్‌ గతనెల నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం...ఆరు దేశాలకు చెందిన వలసదారులను 90 రోజుల పాటు, అన్ని దేశాలకు చెందిన శరణార్థులను 120 రోజుల పాటు అమెరికాలో నిషేధించారు. గ్రీన్‌కార్డు హోల్డర్లపై ఉన్న ప్రయాణ ఆంక్షలను ఎత్తివేశారు. అయితే, వలసదారులకు సంబంధించి లక్షలాది కేసులు స్థానిక కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కేసుల సత్వర పరిష్కారం కోసం 50 మంది న్యాయమూర్తులను నియమించినట్టు యూ ఎస్‌ న్యాయశాఖ తెలిపింది. కాగా, మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాకు వచ్చిన అక్రమ వలసదారులను గుర్తించి దేశ బహిష్కరణ చేస్తున్నట్టు యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలి పారు. అమెరికాలో ప్రవాసముంటున్న కోటీ లక్ష మంది వలస దారుల దగ్గర సరైన ధ్రువపత్రాలు లేవని ఆరోపించారు. అక్రమ వలసదారులను స్థానిక నిర్బంధ కేంద్రాల్లో నిర్బంధిం చడంతో డిటెన్షన్‌ సెంటర్లన్నీ రద్దీగా మారిపోయాయని అన్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించాలని ట్రంప్‌ సర్కార్‌ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా అక్రమ వలసదారుల వివరాలను సేకరించి దేశ బహిష్కరణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 
ట్రంప్‌ ఆదేశాలను కోర్టులో సవాలు చేసిన రాష్ట్రాల వాదనలు 
ఓరిగాన్‌ : ట్రంప్‌ ఆదేశాలతో స్థానిక పౌరులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సంరక్షణ పథకాల అమలుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందుకే, ట్రంప్‌ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కోర్టులో దావా వేశాం. 
వాషింగ్టన్‌ : ఈ ఏడాది జనవరి 27న ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌కు, గతనెల జారీ చేసిన నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. 
న్యూయార్క్‌ : అమెరికా నుంచి ముస్లింలను బహిష్కరించాలన్న దురుద్దేశం ట్రంప్‌ న్యూ ట్రావెల్‌ బ్యాన్‌ ఆదేశాల్లో ఇమిడి ఉన్నది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. అమెరికాలో అసహనం, జాతి వివక్ష భావాలకు చోటు లేదు.
మసాచుసెట్స్‌ : ముస్లింల పట్ల ట్రంప్‌కు ఉన్న జాత్యహంకార భావాలు ట్రంప్‌ నూతన ఆదేశాలతో మరోసారి బయటపడ్డాయి. 
హవాయి : అమెరికా అధ్యక్షుడి ఆదేశాల వెనుక కుట్ర దాగి ఉన్నది. అమెరికాలోని ముస్లింలను తరిమివేసేం దుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ఆయన అనుసరి స్తున్న విధానాల కారణంగా పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. హవాయి విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com