నటి గౌతమికి మంచి ఆఫర్ ఇచ్చిన బీజేపీ

- March 15, 2017 , by Maagulf
నటి గౌతమికి మంచి ఆఫర్ ఇచ్చిన బీజేపీ

జయ మరణంపై అనుమానాలున్నాయంటూ ప్రధానికి లేఖ రాసి సంచలనం సృష్టించిన నటి గౌతమి రాజకీయాల్లోకి రానున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీకాగా, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చేనెల 12వ తేదీన ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈనెల 16వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతుండగా మంగళవారం వరకు ఏ ఒక్క పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఉత్తరాది ఎన్నికల ప్రభంజనంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ దక్షిణాది వైపు చూస్తుండగా, ఆర్కేనగర్‌ ఉపఎన్నికల్లో నటి గౌతమిని అభ్యర్థిగా దింపేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కపార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. బుధవారం తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తామని డీఎంకే నేత స్టాలిన్ పేర్కొనగా అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్, పన్నీర్ వర్గం నుంచి మధుసూదనన్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అన్నాడీఎంకేలో రెండు వర్గాలు అభ్యర్థిని ఖరారు చేయడం కంటే రెండాకుల చిహ్నం దక్కించుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి.
ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికపై ప్రధాన ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని రెండురోజుల్లో ప్రకటిస్తుందని ఇరువర్గాలు ఆశిస్తున్నాయి. సీఈసీ నిర్ణయాన్ని బట్టీ రెండాకుల చిహ్నం ఎవరికో తేలిపోతుంది. జయలలిత మేనకోడలు దీప స్వతంత్య్ర అభ్యర్థిగా పోటికి దిగడం ఖాయమైంది. పోటీ చేయాలా వద్దా అనే అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షులు జీకే వాసన్‌ తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సాధించిన విజయం ప్రభావం తమిళనాడుపైనా పడుతుందని, దాంతోపాటు సినీ గ్లామర్ కూడా కొంతమేరకు పనిచేస్తుందనే ఉద్దేశంతో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు గౌతమి అభ్యర్థిత్వంపై బీజేపీ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com