ఐపీఎల్ ఆరంభోత్సవం వేడుకలకు కేంద్రం కానున్న ఉప్పల్
- April 04, 2017
విందు, వినోదాలతో సాగే అట్టహాసంగా సాగే ఐపీఎల్ ఆరంభోత్సవం ఈ సారి కాస్త భిన్నంగా జరగనుంది. గత తొమ్మిదేళ్ళు తొలి మ్యాచ్ వేదికలోనే ఆరంభోత్సవాలు జరగ్గా.. ఐపీఎల్లోని 8 జట్లు వారి సొంతగడ్డపై ప్రారంభోత్సవాల్ని నిర్వహిస్తుండటం ఈసారి ప్రత్యేకత. దీనిలో ప్రధాన వేడుకలు మాత్రం ఉప్పల్ స్టేడియంలోనే జరగనున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ ఓపెనింగ్ సెర్మనీ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. బుధవారం సాయంత్రం మ్యాచ్కు ముందు అరంగంట సేపు ఆరంభ వేడుకలు జరగనున్నాయి. ఐపీఎల్లో ఇది పదో సీజన్ కావడంతో దీన్ని ప్రత్యేకంగా భావించి స్థానిక ప్రేక్షకులకు వినోదం పంచాలన్న ఫ్రాంచైజీల కోరిక మేరకు 8 వేదికల్లో ఆరంభ వేడుకల్ని నిర్వహించాలని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించింది. ప్రతి ఫ్రాంచైజీ తన సొంతగడ్డపై తలపడే మొదటి మ్యాచ్కు ముందు ఆరంభోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ హైదరాబాద్కు తొలి అవకాశం దక్కింది. బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్కు ముందు ఉప్పల్ స్టేడియంలో ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ఓపెనింగ్ సెర్మనీలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్లను ఘనంగా సత్కరించనున్నారు.
తర్వాత బాలీవుడ్ నటి అమీ జాక్సన్ 300 మంది డ్యాన్సర్లతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. అలాగే ఎ.ఆర్.రెహమాన్ టీమ్ తమ మ్యూజిక్ షోతో అభిమానులను అలరించనుంది. అయితే ఏఆర్ రెహమాన్ దీనికి హాజరుకావడంపై సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే ఆరంభ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఆరంభ వేడుకలు ముగిసిన తర్వాత రాత్రి 8 గంటలకు సన్రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ మొదలుకానుంది. నగరంలో తొలిసారి ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుండడంతో ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీనికి తోడు తొలి మ్యాచ్లోనే స్టార్ ప్లేయర్స్తో కూడిన రెండు జట్లు తలపడుతుండడంతో స్టేడియం కిక్కిరిసిపోనుంది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







