భారత లో విమాన ప్రయాణానికి కొత్త నిబంధనలు

- May 05, 2017 , by Maagulf
భారత లో విమాన ప్రయాణానికి కొత్త నిబంధనలు

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ పుణ్యమా అని విమాన ప్రయాణానికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్‌లో పుణె నుంచి దిల్లీ వెళ్లే క్రమంలో గైక్వాడ్‌ ఎయిర్‌ ఇండియా సిబ్బందిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌ జెట్‌, గో ఎయిర్‌ విమానాల్లో గైక్వాడ్‌ను ఎక్కించుకునేందుకు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే సదరు ప్రయాణికుడిని ‘నో ఫ్లై లిస్ట్‌’లో చేర్చనున్నారు. ఒక్కసారి ఈ లిస్టులో పేరు నమోదైతే ఇక అతను ఏ విమానంలోనూ ప్రయాణించే వీలు ఉండదు. ఈ తాజా నిబంధనలను కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి ప్రకటించనున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా, విమానాశ్రయంలో గానీ, విమానంలో గానీ, సిబ్బందితో ఘర్షణకు దిగినా ఆ వ్యక్తి నేరం చేసినట్లుగా భావించి అతని పేరును ‘నో ఫ్లై లిస్టు’లో నమోదు చేస్తారు. దీంతో అతను విమాన టికెట్లు బుక్‌ చేసుకునే వీలుండదు. ఆధార్‌ తదితర వివరాల ద్వారా లిస్టులో ఉన్న వారిని గుర్తిస్తారు. గైక్వాడ్‌ పేరును ఈ లిస్టులో ఉంచడం వల్లే 25సార్లు టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రయత్నం చేసినా అది వీలుకాలేదు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకునే తాము ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తెలిపారు. ‘నో ఫ్లై లిస్టు’లో పేరు నమోదైన వారిపై కొంతకాలం మాత్రమే నిషేధం అమల్లో ఉంటుంది. ఆ తర్వాత సరైన ఆధారాలు చూపి యథావిధిగా విమాన ప్రయాణం చేయవచ్చు. దేశంలోని విమానయాన సర్వీసులకు మాత్రమే ఈ నిబంధనలు అమలుకానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com