30న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

- May 16, 2017 , by Maagulf
30న కేరళను తాకనున్న  నైరుతి రుతుపవనాలు

దేశ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు ఈ నెల 30న కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్‌ 1న వచ్చే రుతుపవనాలు ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా వుండడంతో రెండు రోజుల ముందుగానే కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దక్షిణ అండమాన్‌లో ప్రవేశించిన రుతుపవనాలు మంగళవారం నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రంలో అనేక ప్రాంతాలు, అండమాన్‌, నికోబార్‌ దీవులకు పూర్తిగా విస్తరించాయి. వచ్చే 48 గంటల్లో ఉత్తర అండమాన్‌ సముద్రం మొత్తం, తూర్పు, మధ్య బంగాళాఖాతాలకు విస్తరిస్తాయని తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాలు గత ఏడాది జూన్‌ 7న ప్రవేశించగా, 2015లో కూడా మే 30నే కేరళను తాకాయి. ఈ ఏడాది రుతుపవనాల రాకకు సంబంధించి అనేక అంశాలు అనుకూలంగా వుండడంతో సాధారణ తేదీకి రెండు రోజుల ముందుగా వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ అంచనాకు నాలుగు రోజులు అటు ఇటుగా రావచ్చని తెలిపింది. దక్షిణ చైనా సముద్రం, పశ్చిమ పసిఫిక్‌, హిందూ మహాసముద్రంలో తేమగాలులు రుతుపవనాలకు అనుకూలంగా వున్నాయని పేర్కొంది. కాగా, ఉత్తర కోస్తా నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది.

దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో చెదురుముదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల్లో వడగాడ్పులు వీస్తాయని, రుతుపవనాలు వచ్చే వరకు ఎండ తీవ్రత, గాడ్పులు కొనసాగుతాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com