ప్రవాసాంధ్రులకూ ధీమా!

- July 03, 2017 , by Maagulf
ప్రవాసాంధ్రులకూ ధీమా!

''విదేశాలకు వెళ్లారు. బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. జన్మభూమికి ఏదో ఒకటి చేయండి''... అమెరికాలోనో, మరో దేశంలోనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా, వ్యాపారవేత్తలుగా స్థిరపడిన వారికి ప్రభుత్వం ఇచ్చే పిలుపు ఇది! మరి... గల్ఫ్‌ దేశాల్లో అష్టకష్టాలు పడుతున్న వారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి వారి సంక్షేమంపై మరింతగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వారు కూడా రాష్ట్రంలో నివసిస్తున్న వారిగానే భావిస్తూ... వారి సంక్షేమానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నారు. 2016లో ఏర్పాటు చేసిన నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఎన్‌ఆర్టీ) సంస్థ చైర్మన్‌ రవికుమార్‌, సీఈవో కె.సాంబశివరావు గల్ఫ్‌ బాధితులను ఆదుకోవడంపై ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమయ్యారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన సమన్వయకర్తల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఇవీ ఆ వివరాలు...
ఇప్పటికే గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారు, వెళ్లబోయేవారు తప్పనిసరిగా ఎన్‌ఆర్టీ వద్ద పేర్లు రిజిస్టర్‌ చేయించుకోవాలి. వారికి వెంటనే ఒక నంబరును ఇస్తారు. భవిష్యత్‌లో ఈ నంబరుతోనే ఎన్‌ఆర్‌టీతో సంప్రదింపులు జరపవచ్చు.
రాష్ట్రంలో వారికి అల్పాదాయ వర్గాల వారికి అందిస్తున్న తెల్ల రేషన్‌ కార్డు రద్దు చేయాలంటూ ఎలాంటి ప్రతిపాదనలూ చేయరు. పైగా.. రాష్ట్రంలో నివసిస్తోన్న తెలుగువారి తరహాలోనే ప్రవాసాంధ్రుల హక్కులు కాపాడతారు.
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చంద్రన్న బీమా తరహాలో.. గల్ఫ్‌ దేశాలలో నివసిస్తున్నవారికి ప్రత్యేక బీమా అమలు చేస్తారు.
గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తోన్న ప్రవాసాంధ్రులకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందుతుందో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి తెలుసుకుని ఆ వివరాలన్నీ ప్రవాసాలకు అందుబాటులోకి తెస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com