మాదకద్రవ్యాల కేసులో ముమైత్ ఖాన్ ను విచారిస్తున్న సిట్

- July 26, 2017 , by Maagulf
మాదకద్రవ్యాల కేసులో ముమైత్ ఖాన్ ను విచారిస్తున్న సిట్

మాదకద్రవ్యాల కేసులో నోటీసు అందుకున్న ఐటెం సాంగ్ గర్ల్ ముమైత్ ఖాన్ గురువారం సిట్ ముందు హాజరయ్యారు. గురువారం ఉదయం 10గంటలకే ఆమె సిట్ ఆఫీసుకు చేరుకున్నారు. ఆమె వెంట మా స్టార్ ప్రతినిధులు, బిగ్ బాస్ ప్రతినిధి వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో బుధవారం నటి చార్మిని సిట్ బృందం విచారించిన విషయం తెలిసిందే.
కాగా, భద్రతా కారణాల దృష్ట్యా ఎక్సైజ్ కార్యాలయం పరిసరాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.డ్రగ్స్‌ ముఠా నాయకుడు కెల్విన్‌ సెల్‌ఫోన్‌లో ముమైత్‌ఖాన్‌ ఫోన్‌ నంబర్‌ ఉండటంతో పాటు వీరిద్దరి మధ్య వాట్సాప్‌ ఛాటింగ్‌ వివరాలు సిట్‌ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను ఓ సాక్షిగా విచారించాలని భావించిన అధికారులు.. విచారణలో భాగంగా సినీ రంగానికి డ్రగ్స్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు.
కెల్విన్‌ ముఠాతో ఎప్పుడు పరిచయమైంది, అతడు డ్రగ్స్‌ ఎవరెవరికి సరఫరా చేసేవాడు, చిత్ర పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్‌ అలవాటుంది, దర్శకుడు పూరీతో సంబంధాలపై లోతుగా విచారించనున్నట్లు తెలుస్తోంది. ముమైత్‌కు టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ నటించిన అనుభవం ఉండటంతో ఆయా చిత్ర పరిశ్రమల్లోనూ డ్రగ్స్‌ వినియోగంపై ప్రశ్నించే అవకాశం ఉంది. ఏఈఎస్‌ పవన్‌కుమార్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు రేణుక, జయలక్ష్మి, సబ్‌ఇన్‌స్పెక్టర్లు శ్రావణి విచారణలో బృందంలో ఉన్నారని ఎక్సైజ్‌ వర్గాలు తెలిపాయి.
అంతేగాక, డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్.. ముమైత్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారని ఎక్సైజ్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. కాగా, సిట్ విచారణ నేపథ్యంలో బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటున్న ముముతై ఖాన్ బుధవారమే పుణె నుంచి హైదరాబాద్ చేరుకుని ఓ హోటల్‌లో బస చేశారు.
బుధవారం నటి చార్మిపై ఓ కానిస్టేబుల్ చేయి వేసి అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శలపాలైన నేపథ్యంలో ముమైత్ ఖాన్‌ను సిట్ కార్యాలయంలోపలికి తీసుకెళ్లేందుకు మహిళా పోలీసులనే ఎక్కువగా నియమించారు.
ఇదిలావుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను కలిశారు. రాష్టవ్య్రాప్తంగా కలకలం రేపుతోన్న డ్రగ్స్ వ్యవహారంపై చర్చించారు. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.
ఈ కేసులో 27 మందిని విచారించి, ఏడుగురిపై కేసులు నమోదు చేశామని, 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు అందించి, ఆరుగురిని విచారించామని వారు సిఎస్‌కు వివరించారు. డ్రగ్స్ కేసులో విచారణ పారదర్శకంగా సాగుతోందని, విచారణకు అందరూ సహకరిస్తున్నారని వారు సిఎస్‌కు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com