అమరావతికి హైపర్‌లూప్‌..!

- July 27, 2017 , by Maagulf
అమరావతికి హైపర్‌లూప్‌..!

హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లాలంటే.. ఎంత టైమ్ కావాలి.. ? విమానం అయితే.. గన్నవరానికి గంట.. అక్కడి ఎంత వేగంగా వెళ్లినా మరో గంట.. ఇక కార్లూ.. బస్సులు ఎక్కితే.. కనీసం నాలుగైదు గంటలు.. కానీ.. కేవలం అరగంటలోపే హైదరాబాద్‌ నుంచి అమరావతికి వెళ్లిపోయే రవాణా వ్యవస్థ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైపర్‌లూప్‌ను.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అందుబాటులోకి తెస్తాంటూ ఆ సంస్థ ముందుకువచ్చింది. నిన్న జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో.. సీఎం చంద్రబాబుకు తమ ప్రతిపాదనలను వివరించారు హైపర్‌లూప్ సంస్థ ప్రతినిధులు. వైజాగ్ నుంచి అమరావతికి కేవలం 23 నిమిషాల్లో, అమరావతి నుంచి తిరుపతికి కేవలం 25 నిమిషాల్లో వెల్లిపోవచ్చన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే.. అమరావతిలోనే పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సింది అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు

అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం సాగుతున్న పరిశోధనల్లో భాగంగానే హైపర్‌లూప్ కాన్సెప్ట్‌ సిద్ధమయ్యింది. టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మాస్క్ దీనికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అబుదాబి - దుబాయ్ మధ్య హైపర్‌లూప్ లైన్‌ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తైతే.. కేవలం గంటలోపే ఈ రెండు నగరాల మధ్య జర్నీ కంప్లీట్ అవుతుంది. పూర్తిగా వ్యాక్యూమ్‌ ట్యూబ్స్‌లో సాగే ఈ ప్రయాణం కోసం ప్రత్యేకంగా పాడ్స్‌ ఉంటాయి. వీటిలోనే ప్రయాణీకులు కూర్చోవాల్సి ఉంటుంది. ఒక్కసారి వాక్యూమ్‌ ట్యూబ్‌లోకి వెళ్లిన తర్వాత.. ఆ పాడ్స్‌ గంటకు 12 వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

హైపర్‌లూప్‌కు సంబంధించిన పాడ్స్‌ను అత్యున్నత ప్రమాణాలతో తయారు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా పోటీని నిర్వహిస్తున్నారు ఎలోన్‌ మాస్క్‌. ఇందులో మన దేశం నుంచి బిట్స్ పిలానీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌, NSIT, RV ఇన్‌స్టిట్యూషన్‌ విద్యార్థులు టీమ్‌గా ఏర్పడి పరిశోధనలు చేస్తున్నారు. అత్యాధునిక పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతో పాడ్స్‌ను వీళ్లు తయారు చేస్తున్నారు. ఆగస్టు చివరికల్లా తొలి పాడ్‌ సిద్ధం కానుంది. ఇక్కడ పరీక్షించిన అనంతరం.. కాలిఫోర్నియాలోని స్పేస్‌ X హెడ్‌క్వార్టర్స్‌లో ఫైనల్‌ రౌండ్‌లో పరిశీలిస్తారు. అయితే.. మన డిజైన్‌ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు హైపర్‌లూప్ ఇండియా ప్రాజెక్ట్ మెంబర్స్‌. ఈ పోటీలో ఉన్న ఇతర 23 టీములు ఖరీదైన కార్బన్ ఫైబర్‌తో ఈ పాడ్స్‌ను తయారు చేస్తుంటే.. మనవాళ్లు మాత్రం.. విమానాల తయారీలో వాడే అల్యూమినియాన్ని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల స్టెబిలిటీ ఎక్కువ ఖర్చు తక్కువగా ఉంటుంది.  ఈ హైపర్‌లూప్‌ ప్రయోగాలు సక్సెస్‌ అయితే.. బుల్లెట్‌ ట్రైన్‌కు అయ్యే వ్యయంలో కేవలం 60 శాతం ఖర్చుతోనే ఈ అత్యాధునిక.. అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విధానంపై ఆసక్తి చూపుతోంది. అటు దేశవ్యాప్తంగానూ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి హైపర్‌లూప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com