హిమాచల్‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న విషాదం

- August 13, 2017 , by Maagulf
హిమాచల్‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న విషాదం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. హిమాచల్‌ప్రదేశ్‌ రవాణాశాఖకు చెందిన రెండు బస్సులపై కొండచరియలు విరిగి పడటంతో ఒక బస్సు లోయలో పడి కొట్టుకుపోగా.. మరో బస్సుమీద శిథిలాలు పడటంతో తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి జీఎస్‌.బాలి తెలిపారు. మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
మనాలి నుంచి కత్రా, మనాలి నుంచి చంబా ప్రాంతాలకు వెళ్తున్న రెండు బస్సులను శనివారం రాత్రి టీ తాగేందుకు జాతీయరహదారిపై నిలిపి ఉంచారు. అదే సమయంలో బస్సులపై కొండచరియలు విరిగి పడ్డాయి. దాంతో ఓ బస్సు పక్కనే ఉన్న లోయలో 800 మీటర్ల లోతులో పడిపోయింది. ఇంకో బస్సుపై పూర్తిగా శిథిలాలు పడ్డాయి. ఒక్కో బస్సులో 30 నుంచి 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, స్థానిక అధికారులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం కారణంగా 21వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని మండి డిప్యూటీ కమిషనర్‌ సందీప్‌ కదమ్‌ ధ్రువీకరించారు.
 
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి 
'మండి ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ప్రమాదంలో గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాం' అని ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

రాహుల్‌ సంతాపం 
ఈ ప్రమాదంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానన్నారు. హిమాచల్‌ ప్రభుత్వం, స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని రాహుల్‌ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com