ఇకపై సౌదీలో భారతీయులకు ఉద్యోగాలు కష్టం

- August 23, 2017 , by Maagulf
ఇకపై సౌదీలో భారతీయులకు ఉద్యోగాలు కష్టం

 స్వదేశీయులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటీవల అగ్రరాజ్యం అమెరికా తమ వీసా విధానంలో నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సౌదీ అరేబియా కూడా తమ దేశస్థులకు ఉద్యోగవకశాలు పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆ దేశంలో పాటించే నితాఖత్‌(సౌదీసేషన్‌) విధానంలో సవరణలు చేపట్టింది. విదేశీయుల కంటే సౌదీలకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేలా ఈ సవరణలు చేసింది. సెప్టెంబర్‌ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లే భారతీయులకు ఉద్యోగాలు దొరకడం కష్టతరం కానుంది.
ఇటీవల లోక్‌సభలో ఇచ్చిన నివేదిక ప్రకారం.. 2016లో భారత్‌ నుంచి 25లక్షల మంది సౌదీలో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంలో ఉన్నవారే. అంటే కూలీలు, మేస్త్రీలుగా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌బంగా, బిహార్‌, కేరళ రాష్ట్రాల నుంచి సౌదీకి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. విదేశాల నుంచి వలసలు పెరిగిపోతుండటంతో స్వదేశీయులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు సౌదీ అరేబియా 2011లో నితాఖత్‌ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే ప్రయివేటు సెక్టార్లలో విదేశీ ఉద్యోగులకు బదులుగా సౌదీ జాతీయులకు ఉద్యోగావకాశాలు పెంపొందించడం. ఈ విధానం కింద దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలను నాలుగు కేటగిరీలుగా చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు, చేసే వ్యాపారం, వచ్చే ఆదాయాన్ని, ఉద్యోగుల సగటు జీతం బట్టి ప్లాటినం, గ్రీన్‌, ఎల్లో, రెడ్‌ సంస్థలుగా విభజించింది.
వీటిని బట్టి సంస్థల్లో సౌదీ, విదేశీ ఉద్యోగుల నిష్పత్తిని ప్రభుత్వం తయారుచేస్తుంది. ఉదాహరణకు ప్లాటినం సంస్థల్లో 40శాతం కంటే ఎక్కువగా సౌదీ జాతీయులే ఉద్యోగులుగా ఉండాలి. ఇప్పటివరకూ 10 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న ప్రయివేటు సంస్థలకు నితాఖత్‌ విధానాన్ని అమలు చేసేవారు. తాజాగా చేపట్టిన సవరణలో ఈ సంఖ్యను 6 లేదా అంతకంటే ఎక్కువకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక.. ప్లాటినం, హైగ్రీన్‌ సంస్థలు మాత్రమే బ్లాక్‌ వీసాల జారీకి అర్హులని నిర్ధారించింది. ప్లాటినమ్‌, హైగ్రీన్‌ కేటగిరీల్లో ఉండే సంస్థలు తక్కువగా ఉండటంతో భారత్‌ నుంచి వెళ్లే వారికి ఉద్యోగావకాశాలుతగ్గిపోనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com