ఎన్‌ఆర్‌ఐ వివాహాలకు ఆధార్‌ కావాలా?

- September 13, 2017 , by Maagulf
ఎన్‌ఆర్‌ఐ వివాహాలకు ఆధార్‌ కావాలా?

న్యూ ఢిల్లీ: ఎన్‌ఆర్‌ఐ సంబంధం అంటే చాలు కొంతమంది తల్లిదండ్రులు వారి గురించి ఎటువంటి విచారణ చేయకుండా తమ ఆడపిల్లలను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఫలితంగా అమ్మాయిలు భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిన తర్వాత ఎన్‌ఆర్‌ఐల అసలు రంగు బయటపడుతుంది. అదనపు కట్నం కోసం వేధించడం, గతంలో పెళ్లయిన విషయాన్ని దాచి మరో పెళ్లి చేసుకున్న ఘటనలు బయటపడుతున్నాయి.

వాటిని నియంత్రిచేందుకు ఇక నుంచి ఎన్‌ఆర్‌ఐల వివాహానికి రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ నంబరును తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను నిపుణుల కమిటీ కేంద్ర విదేశాంగశాఖకు సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందజేసింది.
భారత్‌లో ఎన్‌ఆర్‌ఐ వివాహాల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనకు సంబంధించిన నివేదికను ఇచ్చినట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి. భార్యను వదిలేసి వెళ్తున్న ఎన్‌ఆర్‌ఐ భర్తలను పట్టుకునేందుకు, గృహహింస, అదనపు కట్నం వేధింపులను నియంత్రించేందుకు ఇది దోహదపడుతుందని కమిటీ తెలిపింది. ఎన్‌ఆర్‌ఐలమని చెప్పి మోసం చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిని పట్టుకోవడం కష్టతరంగా ఉందని మహిళా, శిశు సంక్షేమశాఖ(డబ్ల్యూసీడీ) కూడా చెబుతోందని కమిటీ వెల్లడించింది.
దీంతో పాటు నిందితుల అప్పగింత కోసం భారత్‌ పలు దేశాలతో చేసుకున్న ఒప్పందంలో కట్నం వేధింపులను కూడా చేర్చాల్సిందిగా కమిటీ సూచించింది. ఎన్‌ఆర్‌ఐ భర్తల వేధింపుల తరహా వంటి కేసులను పరిశీలించడానికి జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ప్రత్యేకంగా ఓ నోడల్‌ అథారిటీని నియమించాలనే కీలక సూచనను కూడా కమిటీ చేసింది. ఎన్‌సీడబ్ల్యూ నివేదిక ప్రకారం 2005 నుంచి 2012 వరకు ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో ఇటువంటివి దాదాపు 1300 కేసులు నమోదయ్యాయి.
అయితే.. ఇప్పటి వరకు ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ లేదు. వర్కింగ్‌ పాలసీ మీద విదేశాల్లో ఉంటున్న భారతీయ పౌరులకు, భారత సంతతి పౌరులకు ఆధార్‌ లేదు. వీరికి ఆధార్‌ ఇచ్చేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ పౌరులతో పాటు వాలిడ్‌ వీసాలతో భారత్‌లో ఉంటున్న విదేశీయులకు మాత్రమే ఆధార్‌ నమోదు చేసుకోగలగుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com