మంత్రి కేటీఆర్ కు మోదీ లేఖ

- September 14, 2017 , by Maagulf
మంత్రి కేటీఆర్ కు మోదీ లేఖ

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు.. ప్రధాని మోడీ ప్రత్యేకంగా లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాల్సిందిగా కోరారు. జాతిపిత గాంధీజీ ఆశయాల మేరకు స్వచ్చత కార్యక్రమం చేపట్టామని అందులో గుర్తుచేశారు. కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారానే లక్ష్యాలు సాధించగలమని మోడీ లేఖలో తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరు స్వచ్చత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అది మహాత్ముడి ప్రబోధమని గుర్తుచేశారు. వచ్చే నెలలో జరుపుకోనున్న గాంధీ జయంతి సందర్భంగా, స్వచ్ఛప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ యే సేవ’ అనే నినాదంతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా మోడీ కోరారు. 

సమాజంలో స్వచ్ఛత కోసం పనిచేయడం అంటే పేద, బలహీన వర్గాలకు సేవ చేయడమేనని కేటీఆర్‌కు రాసిన లేఖలో ప్రధాని పేర్కొన్నారు. దుర్గంధపూరితమైన వాతావరణం ఆయా వర్గాలకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథపై ప్రశంసలు ప్రధాని కురిపించారు. ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించే అద్భుత కార్యక్రమాన్ని కేసీఆర్‌ సర్కార్ తీసుకుందన్నారు. నదులు, సరస్సులు, చెరువులను కాపాడుకోవడంతో పాటు, వేస్టేజ్‌ మేనేజ్మెంట్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వచ్చ భారత్ కోసం కొంత సమయం కేటాయించి, భాగస్వాములు కావాలని కేటీఆర్‌ను ప్రధాని కోరారు. 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గుర్తించినందుకు మోడీకి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. స్వచ్చ భారత్‌లో భాగంగా తమ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపట్టిందన్నారు. హైదరాబాద్ మహానగరంలో తడి-పొడి చెత్త, స్వచ్ఛ ఆటోలు, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై ఫోకస్‌ చేస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి సందేశం మేరకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని కేటీఆర్ స్పష్టంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com