'ETCA' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'బతుకమ్మ,దసరా' సంబరాలు

- September 23, 2017 , by Maagulf

యు.ఏ.ఈ: తేదీ 22 సెప్టెంబర్ 2017 శుక్రవారం రోజున ఉమల్ కువైన్ లోని ఇండియన్ అసోషియేషన్ వేదికగా సుమారు 3000 మంది భారీ జన సందోహం నడుమ UAE తెలంగాణ జాగృతి ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం( ETCA) ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 'బతుకమ్మ మరియు దసరా సంబరాలు' ఎంతో అట్టహాసంగా జరిగాయి. 

ఈ విశేషమైన వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ పార్లమెంటు సభ్యులు అయిన జి.వివేకానంద్ మరియు ఆయన సతీమణి, విసాక ఇండస్ట్రీస్ ఎండీ జి.సరోజ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్  హాజరు కాగా కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా 'స్వరాంజలి' ఫేమ్ శ్రీమతి కవిత చక్ర  నిలిచారు. స్థానిక   ప్రముఖులు మరియు పలు సంఘాల ప్రతినిథులు పాల్గొన్నారు. 

ముందుగా కళాకారుల డప్పు వాయుద్యాలతో బతుకమ్మలను ఎదుర్కొని తదనంతరం మహిళా అతిథులు మరియు ETCA మహిళా సభ్యులందరూ కలిసి గౌరీ పూజను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది.తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలను ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో అందమైన బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరు కావడం మరియు బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడి పాడటంతో వేదిక అంతా గొప్ప పండగ వాతావరణంతో  నిండి పోయింది.  

అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథులు అయిన శ్రీ వివేకానంద్ మాట్లాడుతూ, భారీ ఎత్తున నిర్వహించబడిన సంబరాలు చూసి ETCA వారి కృషిని ఎంతగానో  కొనియాడారు. శ్రీమతి సరోజ మహిళలందరితో కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు.  నైనా జైస్వాల్ మాట్లాడుతూ ఖండాంతరాల్లో ఉండి కూడా  తెలంగాణ తలమానికమైన బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవడం చూసి సంతోషం వ్యక్తం చేశారు. గాయని శ్రీమతి కవిత చక్ర చక్కని వ్యాఖ్యానం తో కార్యక్రమానికి వన్నె తెచ్చారు.

ఈ సందర్భంగా మహిళలు రంగు రంగుల పువ్వులతో పేర్చి తీసుకొచ్చిన వివిధ రకాల బతుకమ్మలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. నిర్వాహకులు అందమైన బతుకమ్మలను ఎన్నుకొని బహుమతులు ప్రదానం చేశారు. అంతే కాకుండా బతుకమ్మ పాటల పోటీలు, సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ETCA మహిళా సభ్యులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి బతుకమ్మ ప్రసాదంను అందజేయడం జరిగింది.

ఈ వేడుకకు ఖజానా జువెల్లర్స్ ప్రధాన స్పాన్సర్ కాగా, LSPMK, SRR బిల్డింగ్ మెటీరియల్స్, మహ శ్వేత ఫుడ్స్ మరియు రియల్ టేస్ట్ రెస్టారెంట్ వారు ఇతర స్పాన్సర్స్ గా వ్యవహరించారు. 

ఈ సంబరాల్లో UAE జాగృతి అధ్యక్షులు, ETCA వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు అయిన శ్రీ కిరణ్ కుమార్ పీచర  కార్యక్రమం విజయవంతంగా జరిగేటట్టు కృషి చేయగా మంచుకొండ వెంకటేశ్వర్లు, రాధారపు సత్యం మరియు ఇతర సభ్యులు తగు విధాలుగా తమ వంతు సహాయ సహకారాలను అందించారు.  ​

--సింగిరి రవి కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి, నార్తర్న్ ఎమిరేట్స్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com