దుబాయ్ వ్యాపారవేత్తలతో చర్చల్లో బిజీగా ఉన్న చంద్రబాబు

- October 22, 2017 , by Maagulf

ఏపీలో వ్యాపారాలు చేసే NRIలకు సహకరిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. దుబాయ్ లో ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ ను ఉద్దేశించి సీఎం ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ పర్యటనలో ప్రవాసాంధ్రులు చూపిస్తున్న ప్రతిస్పందన తనకెంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోని 5 ఉత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చి దిద్దుతున్నామని తెలిపారు. దుబాయ్ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రవాసాంధ్రులంతా అమరావతి నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చిన తనకు, మళ్ళీ హరిత నగరం అమరావతి నిర్మించే గొప్ప అవకాశం లభించిందని చంద్రబాబు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఆటోమొబైల్, ఫార్మా, ఏరో స్పేస్ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కేవలం ఖనిజ వనరులే కాక, అత్యుత్తమ మానవ వనరులు కూడా కలిగిన రాష్ట్రం ఏపీ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఎన్‌ఆర్‌ఐల వ్యాపారాలకు ఆంధ్రప్రదేశ్ సరైన గమ్య స్థానమని, ప్రతిపాదనలు తీసుకుని రాష్ట్రానికి రావాలని పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. ఎమిరేట్స్ బిజినెస్ టవర్స్‌లో డీపీ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ సుల్తాన్ అహ్మద్‌తో చంద్రబాబు సమావేశమై, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు వివరించారు. ఈ సమావేశం లో ఏపీ ఎన్ఆర్ఐ మినిస్టర్ శ్రీ కొల్లు రవీంద్ర గారు మరియు ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ యనమల రామకృష్ణుడు గారు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com