ఆధార్-పాన్ అనుసంధానం: మార్చి నెలాఖరు వరకు గడువు పెంపు

- December 09, 2017 , by Maagulf
ఆధార్-పాన్ అనుసంధానం: మార్చి నెలాఖరు వరకు గడువు పెంపు

ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు లింక్ చేసేందుకు డిసెంబర్ 31వరకు యూఐడీఏ గడువు విధించింది. తాజాగా ఆ గడువును 2018 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. తొలుత ఈ గడువును 2017 జూలై 31వ తేదీ వరకు ప్రకటించగా... ఆ తర్వాత దాన్ని ఆగస్టు 31 వరకు, అనంతరం డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
అయితే తాజాగా ఆ గడువును మరోసారి 2018 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తడంతో.. ప్రజల సౌకర్యార్థం కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తం మీద 33 కోట్ల మంది పాన్ ఖాతాదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 13.28 కోట్ల మంది తమ పాన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు.
వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను పొందే ఆధార్ నెంబర్ అనుసంధానంపై మార్చి 31వరకు గడువును పొడిగించేందుకు సిద్ధమేనని ఇటీవల కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. అంతేగాకుండా ఇప్పటివరకు ప్రకటించిన గడువులోపు తమ పాన్‌ కార్డును ఆధార్‌తో ప్రజలు అనుసంధానం చేసుకోలేకపోయారనే విషయం ఆర్థిక శాఖ దృష్టికి వెళ్లడంతో గడువును పెంచినట్లు అధికారులు తెలిపారు. అందుకే అనుసంధానం చేయని వారికి మరో అవకాశం కల్పిస్తూ వచ్చే ఏడాది 2018 మార్చి 31వరకు గడువు పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com