కాలుష్య కారకులే నష్టాన్ని భర్తీ చేయాలి: చైనా
- December 18, 2017
బీజింగ్ : పర్యావరణానికి నష్టం కలిగించేవారే ఆ నష్టాన్ని భర్తీ చేసేలా లేదా నష్టపరిహారం చెల్లించే విధంగా 2020 నాటికి దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను ప్రవేశపెట్టాలని చైనా యోచిస్తోంది. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. పర్యావరణాన్ని కలుషితం చేసేవారిపై ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యల్లో భాగమే ఇది. వచ్చే మూడేళ్ళ కాలంలో పర్యావరణ పరిరక్షణకు సమగ్ర వ్యవస్థను నెలకొల్పాలన్నది చైనా లక్ష్యంగా వుంది. పర్యావరణానికి ఎవరివల్ల నష్టం జరుగుతుందో వారే పరిహారం చెల్లించేలా చూడనున్నట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ కార్యాలయాలు విడుదల చేసిన పత్రం ఆదివారం పేర్కొంది. పర్యావరణానికి ఏ విధంగానైనా నష్టం కలిగించే వ్యక్తులు లేదా సంస్థలే తిరిగి పర్యావరణాన్ని శుద్దిచేసే బాధ్యత కూడా చేపట్టాలని లేదా నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంటోంది. అయితే ఆ నష్టపరిహారం ఎంత అనేది వివరాలేమీ ఆ పత్రంలో వెల్లడించలేదు. భూమి, నీరు, గాలి కాలుష్యాల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టంగా చూసేందుకు ఈ పెనాల్టీలు ఉద్దేశించబడ్డాయి. పెద్ద ఎత్తున జరిగే ప్రమాదాల తర్వాత తిరిగి పర్యావరణ పరంగా సమతుల్యతను పునరుద్ధరించడానికి, అందుకయ్యే వ్యయానికి ఆయా కంపెనీలే జవాబుదారీ వహించాల్సి వుంటుంది. ఫ్యాక్టరీలు, కంపెనీలు పెద్ద మొత్తంలో విషతుల్యమైనటువంటి రసాయనాలను నదుల్లో కలిపేస్తున్నాయని, దాంతో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం జరుగుతున్నాయి.
తీర ప్రాంత పర్యావరణాన్ని దెబ్బతీసే చమురు కంపెనీలకు కూడా భారీగా పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం విడిగా ఒక ప్రణాళికను రూపొందించే ఆలోచన చేస్తోంది. కాలుష్యంపై తన పోరాటాన్ని ప్రభుత్వం ఉధృతం చేసింది. కొన్ని ఫ్యాక్టరీలను మూసివేయించింది. తనిఖీలు, పరిశోధనలు జరిపిన తర్వాత కొంతమంది అధికారులను జవాబుదారీగా ప్రకటించింది. ఉత్తర చైనాలో ఈ శీతాకాలంలో లక్షలాది కుటుంబాలు, వేలాదిమంది వ్యాపారవేత్తలు బొగ్గు నుండి సహజవాయువుకు మళ్ళేందుకు ప్రభుత్వం అనూహ్యమైన రీతిలో ప్రచారం చేపట్టింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







